*జంగి, భంగి.. బంజారా వారియర్స్... రచయిత రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాదు జిల్లా*
17వ శతాబ్ద కాలంలో రాథోడ్ వంశంలోని భూక్యా గోత్రమునకు చెందిన అన్నదమ్ములు జంగి, భంగి బంజారా యోధులను నిజాం అసఫ్ జాహి రాజ్యంలో సంచరించడాన్ని మొఘల్ చక్రవర్తి షాబుధ్ధీన్ మొహమ్మద్ షాజహాన్(పరిపాలన కాలం1628-1658) ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించ బడిన తామ్ర శాసనాన్ని వీరి ధైర్య సాహసాలు, పనిలో నిబద్ధత, అంకిత భావం, నీతి నిజాయితీ మొదలగు గుణగణాలను పరిశీలించి బహుమానంగా ఇచ్చారు.అందులో నిజాం రాచరిక ప్రభుత్వంలో ఉత్తర భారతీయు
బంజారా వ్వాపారులైన జంగి, భంగి లు ఇద్దరు నిర్భయంగా, స్వేచ్ఛధంగా దక్కన్ నిజాం రాజ్యంలో ఉండవచ్చును.వారికి ఎవరు ఆడ్డగించడానికి, అదుపు చేయడానికి వీలులేదు. ఈ రాజ్యంలో వారి గోవులకు నీటి సౌకర్యాలు, మేపడానికి పూర్తి అధికారం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వారికే ఉంటుంది.ఏవరైనా వీరి గోవులను, మనుషులను, ఆడ్డు వచ్చి ఎదురు తిరగబడితే వారికి హత్య చేసె అధికారం ఈ జంగి, భంగి లకు ఉంది. ఇలా వీరు రోజుకు ముగ్గురిని చంపడానికి అధికారం కల్పించారు మొఘలులు. చంపిన తర్వాత కోర్టులో వీరికి ఎలాంటి విచారణ శిక్ష కూడా ఉండదు. ఎక్కడైతే అసఫ్ ఖాన్ గుర్రాలు ఉంటుందో అచట జంగి, భంగిల ఎద్దులు కూడా ఉండొచ్చు అని రాసి ఇచ్చారు. ఇలా ఆ తామ్రశాసనంలో ఈ క్రింది విధంగా ఉర్దూ భాషలో లిఖించబడి ఉంది.
*రంజన్ కా పాని ఛప్పర్ కా ఘాస్( Ranjan ka Pani Chappar ka ghas)*
*దిన్ కె తీన్ ఖున్ మాఫ్ (Din ke theen khun maaf)*
*జహ ఆసఫ్ ఖాన్ కే ఘోడె (Jahaan Asaf Khan ke ghode )*
*వహా జంగి, భంగి కే బైల్ ఖడే(Vahaan Jangi Bhangi me bail khade )*
తొలి సారిగా హైదరాబాదు నిజాం ప్రభుత్వ రాజ్యాధికారంలో అధికారులు దక్కించుకున్న బంజారాల ముఖ్యలలో జంగి భూక్యా, భంగి భూక్యా ఇద్దరు ఉత్తర భారతదేశం రాజస్తాన్ నుండి వచ్చిన రాథోడ్ వంశ బంజారాలు. వీరు గుర్రాల పైన ఎడ్లబండ్ల పైన తమ మనుషులతో లదణి (బిడారు) వ్యాపారులు సాగిస్తూ ఉత్తరం నుండి దక్షిణం వైపు వ్యాపారంలో లాభాలు పొందుతు జీవనం సాగించారు.
1630 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ సైన్యములకు వీరు ఆహర పదార్థాలు, దుస్తులు, నాణ్యమైన వస్తువులు,
యుద్దానికి సంబంధించిన మందు గుళ్ళ సామాగ్రిలు సరఫరా చేస్తు షాజహాన్ చక్రవర్తికి సామాగ్రి సరఫరాలో నమ్మిన బంటుగా ముఖ్య పాత్రలు పోషించారు.
*1724-1948 హైదరాబాద్ రాజ్యంలో:-*
----------------------------------
వీరి కంటే ముందు నుండే జాదవ్ వంశం వడ్తియా గోత్రానికి చెందిన ముఖ్య వ్యాపారులలో భగవాన్ దాస్ వడ్తియా హైదరాబాదు రాజ్యంలో ప్రముఖ వ్యాపారి. అసఫ్ జాహి హైదరాబాదు రాష్ట్రాన్ని పరిపాలించిన ముస్లిం రాజవంశంలో రాజు అసఫ్ జా సైన్యమునకు ఆహార పదార్థాలు, పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు, దుస్తులు, ఆభరణాలు, నాణ్యమైన సరుకులను సరసమైన ధరలో సరఫరా చేస్తు ఉండే వారు. రాథోడ్ వంశం వారు అసఫ్ జాహి -I మొదటి రాజుకు అత్యంత సన్నిహితంగా ఉండి సహకారాలు అందజేస్తుఉండేవారు. అందు వలన షాజహాన్ చక్రవర్తి రాథోడ్ వంశ వ్యాపారులైన జంగి, భంగి భుక్యా వ్యాపారులకు ఒక తామ్రపత్రం సువర్ణ అక్షరాలతో లిఖించి శాసనాన్ని ఇచ్చారని దానితో పాటు ప్రతి సంవత్సరం బహుమానంగా వెండి నాణాలు ఇచ్చే వారని చరిత్ర చెబుతోంది. ఇంతటి గొప్ప రాజు షాజహాన్ కాలాన్ని స్వర్ణ యుగము అని అంటారు.ఈ విధంగా నిజాం రాజ్యంలో అధికారాలు పొందిన జంగి, భంగి లకు హైదరాబాదులో ఉన్న గోల్కొండ కోట యందు వీరికి రాకపోకలు సాగించడానికి
ప్రత్యేక ద్వారమును ఏర్పాటు చేశారు. దానినే *బంజారా దర్వాజా* అని అంటారు.
నిజాం నవాబు హైదరాబాదులోని ఒక కొండ ప్రాంతపు శివారులో ఉన్న బంజారా తాండా వాసులకు ( భూక్యా తాండా , వడ్తియా తాండా ,సీత్య తాండా)
భూములు నీటి వసతిని కలిగి ఉండి ఆవులు, ఎద్దులు మేపడానికి అనుకులమైన గడ్డి ప్రాంతం కావడంతో వీరి ఆవులు మేపడాని విశ్రాంతి కోసం
గుడారాలు వేసుకొవడానికి తాండా ఏర్పాటు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వీరి పేరిట కొంత భూమిని ఇచ్చి దానికి *బంజారా హిల్స్* అని నామకరణం చేశారు.కాని కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బంజారాలకు సంబంధించిన భూములు ఉన్నత శ్రేణి పౌరుల చేతుల్లో ఆక్రమణకు గురికావడంతో దుర్భర పరిస్థితుల్లో జీవితం గడిపిన బంజారాలు అక్కడి పరిస్థితులను తట్టుకోలేక అటవీ సమీప ప్రాంతాల్లకు వలస వెళ్ళారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నత శ్రేణి పౌరుల నివాసానికి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఒకప్పుడు *బంజారా కొండలు* అని పిలువబడే ఈ ప్రాంతం ప్రస్తుతం *బంజారా హిల్స్* పేరుతో ప్రసిద్ధి చెందింది.
*బంజారా హిల్స్ లో బంజారా భవన్:-*
---------------------@----------------
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిజాం ప్రభుత్వ హయాంలో బంజారా ప్రజల స్థితిగతులకు సంబంధించిన పుస్తకాలు పరిశీలించి బంజారాహిల్స్ లో బంజారా ప్రజల అనవాళ్ళు లేకపోవడంతో 2016-2017 సంవత్సర కాలంలో
బంజారా ప్రజల కోసం వారి ఆరాధ్యదైవం శ్రీ, సంత్ సేవాలాల్ మహారాజ్ కోసం ఒక బంజారా భవన్ (BANJARA BHAVAN) నిర్మించి న్యాయం చేయాలనే గొప్ప ఆలోచనతో కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించారు. దాని నిర్మాణానికి సంబంధించిన నిధులు ₹= 24.43 కోట్లు మంజూరు చేశారు. ఈ బంజారా భవనాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభ హస్తాలతో 2022 లో సెప్టెంబర్ 17 న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర బంజారాలకు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు నిధులు మంజూరు చేస్తూ అధికారికంగా జయంతిని రాష్ట్రంలో నిర్వహిస్తుంది. తొలి సారిగా 2023 లో ఫిబ్రవరి 15 న హైదరాబాదులోని బంజారా హిల్స్ లోని బంజారా భవనంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతికి రాష్ట్ర మత్స్య ,పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై నివాళులు అర్పించి మీడియాతో మాట్లాడారు.
*నిజాం నవాబు పరిపాలన కాలంలో:-*
----------------------------------------
నిజాం రాజ్యంలో జంగి, భంగి బంజారాలను ఇస్తున్న ప్రాధాన్యతను చూసి ఓర్వలేక జాదవ్ వంశంలోని వడ్తియా గోత్రానికి చెందిన ముఖ్య వ్యాపారుల్లో భగవాన్ దాస్ వడ్తియా ఒక రోజు నిజాం ప్రభువును కలిసి ఓ ప్రభువు ? మొము మొదటి నుండే సేవలు చేస్తూ
ఆపత్కాల పరిస్థితుల్లో ముందుండే తమ సైన్యం యొక్క సేవా కార్యక్రమాల్లో ఉన్నాము. కనుక ఈ విషయమును పరిగణములో తీసుకొని మాకు కూడా ఒక తామ్రపత్రంలో స్వర్ణ అక్షరాలతో శాసనం లిఖించి ఇవ్వాలని కోరారు. అందుకు నిజాం నవాబు షరతును అంగీకరించక పోవడంతో మాకు అనుకూలంగా వ్యవహరించే నిజాం ప్రభువు జంగి, భంగి అన్నదమ్ములకు అనుకూలంగా ఉన్నారనుకొని అనుమానంతో
భగవాన్ దాస్ వడ్తియా జంగి ,భంగి ఇద్దరి పై కక్ష పెంచుకున్నాడు. అన్నదమ్ములైన వీరిద్దరికీ ఏవిధంగా నైనా హతమార్చాలని ఉపాయం పన్నారు. ఒక రోజు నిజాం నవాబు దర్బార్ హాల్ నుండి కోట బయట వచ్చు క్రమంలో ఇదే మంచి అవకాశమని భావించిన భగవాన్ దాస్ వడ్తియా తన యొక్క సైన్యాన్ని సంసిద్ధం చేసి జంగి, భంగి భూక్యా లను చంపి తన పంథాను నేగించాడు. ఈ యుద్ద వాతావరణ పరిస్థితులను తెలుసుకున్న భంగి భూక్యా కుమారుడు నారాయణ భంగి భూక్యా వందల మంది తన సైన్యంతో భగవాన్ దాస్ వడ్తియా పైన యుద్ధానికి దిగాడు. అప్పుడు భగవాన్ దాస్ వడ్తియా సైన్యం నారాయణ భంగి సైన్యం మధ్య భీకరమైన పోరులో ఇరువర్గాలకు సంబంధించిన అనేక సైనికులు తమ ప్రాణాలను వదిలారు. మరి ఎంతో మందికి గాయాలయ్యాయి. హోరా హోరి సాగిన ఈ యుద్ధంలో చివరకు నారాయణ భంగి సైన్యం భగవాన్ దాస్ వడ్తియా సైన్యం చేతుల్లో పరాజయం పాలైంది. బలమైన శక్తి సామర్థ్యాలు కలిగినా భగవాన్ దాస్ వడ్తియా సైన్యం గెలుపొందడంతో ఆనందాన్ని తట్టుకోలేని భగవాన్ దాస్ వడ్తియా చివరికి నిజాం నవాబు ఇచ్చిన స్వర్ణ అక్షరాల తామ్రపత్రమును హస్తగతం చేసుకుంటారు.