10వ తరగతి - తెలుగు

10వ తరగతి - తెలుగు

 

 10 తరగతి విద్యార్థులకు -శుభాకాంక్షలు

ప్రస్తుత పరిస్థితులలో ఆన్లైన్ విద్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో మావంతు ప్రయత్నంగా 10వ తరగతి విద్యార్థుల కొరకు తెలుగు పాఠములను అందిస్తున్నాము. ముందుముందు ఆడియో వీడియో పాఠములు మరియు ఆన్లైన్ టెస్ట్ లు కుడా అందించే ప్రయత్నము చేస్తామని తెలియజేస్తున్నాము.

ఇవి మీకు తప్పక ఉపయోగపడతాయని ఆశిస్తూ....



ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రిక 
--- Rajendra, Godavarikhani, 6302324734(WhatsApp Only).  




10 తరగతి - తెలుగు వాచకం

1వ పాఠం: దానశీలము

దానశీలము.pdf   

DOWNLOAD HERE




పాఠ్యాంశ వివరణ

    ‘దానము’ అనగా త్యాగం, అడిగినది లేదనకుండా ఇవ్వడం, ఉచితంగా ఇవ్వడం మరియు ఇచ్చిన దానిని తిరిగి తీసుకోకుండా ఉండడం. ‘శీలము’ అనగా గుణము, స్వభావము మరియు మంచి ప్రవర్తన. “దానశీలము”  అంటే  దానము  యొక్క  గొప్పదనం. దానశీలము అనే ఈ పాఠ్యభాగం ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వాన్ని దానం చేయడం లోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. పురాణ ప్రక్రియకు చెందిన ప్రాచీన పద్యాన్నిపరిచయం చేస్తూ త్యాగాన్ని మరియు శీలాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈయబడిన పాఠం ఇది.


కవిపరిచయం

  దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకు సహజ పండితుడు అని బిరుదు గలదు. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం మొదలగునవి రచించాడు.ఇతను రచించిన శ్రీమత్ భాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్ర నుండి ఈ పాఠ్యభాగం  స్వీకరించబడింది. భాగవతము పురాణ ప్రక్రియకు చెందినది.


ప్రక్రియ పరిచయం

 పురాణాలు18. పురాణం అంటే పాతదైననూ కొత్తగా భాసించేది. ‘సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశాను చరితం’ అనేవి పురాణ లక్షణాలు.


విశిష్టత

  బలిచక్రవర్తి తన ప్రాణం పోతుందని తెలిసినా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువైన శుక్రాచార్యుడు ఎంత వారించినా, హెచ్చరించినా గురువు మాటలు వినకుండా వామనునికి దానం చేస్తాడు.


పూర్వకథ/నేపథ్యం

  బలిచక్రవర్తి  తన  శక్తిసామర్థ్యాలతో  స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు.  ఈ విషయాన్ని దేవతలు విష్ణువుతో చెప్పగా  కొంత  కాలానికి విష్ణువు  వామన అవతారం  ఎత్తి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లి మూడడుగుల నేల కావాలని అడగగా ఇస్తానని మాటయిస్తాడు. వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు  బలిని  దానం  ఇవ్వవద్దంటాడు.



సారాంశం

       శుక్రాచార్యుడు - దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడు, ఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు.

     అప్పుడు బలిచక్రవర్తి.... ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరా? రాజ్యాలు లేవా? వారేమైనా మూటగట్టుకొని పోయారా? అడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది. 

        ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తమైనా, ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువు, శివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను.

     ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూ, పంచభూతాలు “బళి బళి” అని పొగడాయి.



కంఠస్థ పద్యాలు - తాత్పర్యాలు


*మ.      కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం

డలఁతిం బోఁడు త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం

              గలడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్

              వలదీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా !

తాత్పర్యం: దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ, నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం  వద్దు.  ఈ  బ్రహ్మచారిని (వామనుడిని)  పంపించు.

*శా.      కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

            వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ

             బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై

             యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !

       తాత్పర్యం:  ఆచార్యా ! పూర్వం రాజులు ఉన్నారు. రాజ్యాలు ఉన్నాయి. వారు ఏంతో అహంకారంతో విర్రవీగారు . కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదూ. ప్రపంచంలో వారి పేర్లుకూడా మిగులలేదు. శిబిచక్రవర్తి వంటివారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోర్కెలు తీర్చలేదా? వారిని ఈనాటికీ లోకం మరువలేదు  కదా.

*మ.     నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు

             ర్మరణం బైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ముపో ;

             హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;

             దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్?

తాత్పర్యం:ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం  వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).




ముఖ్య వివరణలు

దశ దిక్కులు= పది దిక్కులు- దిక్కులు దిక్పాలకులు:- 1.తూర్పు-ఇంద్రుడు, 2.పడమర-వరుణుడు, 3.ఉత్తరము-కుబేరుడు, 4.దక్షిణము-యముడు,5.ఈశాన్యం-శివుడు, 6.నైరృతి-నిరృతి, 7.వాయవ్యము-వాయువు, 8.ఆగ్నేయము-అగ్ని, 9.ఆకాశం-బ్రహ్మ, 10.భూమి-శేషుడు.

వాయువ్యం

ఉత్తరం

ఈశాన్యం

పడమర

భూమి

ఆకాశం

తూర్పు

నైరుతి

దక్షిణం

ఆగ్నేయం

పంచ భూతాలు= పృథివి(భూమి), ఆపస్సు (నీరు), తేజస్సు(అగ్ని), వాయువు(గాలి), ఆకాశం. (నీరు నిప్పు గాలి భూమి ఆకాశం పంచ భూతాలు. భూతము అనగా ప్రాణము. పంచ భూతాలు అనగా ఐదు ప్రాణాలు.) 


విద్యార్థులకు సూచనలు

* పువ్వు గుర్తుగల పద్యాలను  కంఠస్థం చేయాలి. ప్రతి పదార్థాలను, వాటి భావాలను సొంతంగా రాయాలి.

* పాఠం మొత్తం చదువాలి. అర్థం కాని పదాల కింద గీత గీయాలి.

* వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న ‘పదవిజ్ఞానం’ పట్టికలో చూసి లేదా నిఘంటువు (డిక్షనరీ) చూసి తెలుసుకోవాలి.

* కవి పరిచయం, ప్రక్రియా పరిచయాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి.

* పాఠ్యభాగ సారాంశం సొంత మాటల్లో రాయాలి. ఇవి చేయండి లోగల సృజనాత్మక అంశాలను సాధన చేయాలి.

* ఇవి చేయండి లోని భాషాంశాలులో గల పదజాలం, వ్యాకరణాంశాంలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి.



10 తరగతి - తెలుగు వాచకం 


2 పాఠం: ఎవరి భాష వాళ్ళకు వినసొంపు



ఎవరి భాష వాళ్ళకు వినసొంపు:pdf


  

పాఠ్యాంశ వివరణ

    భాష అనే పదం ‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది (ధాతువు అంటే మూలము). భాష భావ వినిమయ సాధనం. ప్రతి ఒక్కరు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తానూ తెలుసు కోవడానికి ఉపయోగపడేదే భాష. సొంపు అనగా సంవృద్ది, సంతోషము, ప్రసన్నత, సుఖము, సౌందర్యము అని మొదలగు అర్థాలు కలవు.

 ఎవరి భాష వాళ్ళకు - ఎవరి మాతృభాష వాళ్ళు విన్నప్పుడు సంతోషం కలగడం సహజం. ఎన్ని భాషలు నేర్చినా తన సొంత భాష ద్వారా పొందే ఆనందాన్ని ఇంక దేని ద్వారా పొందలేరు. వ్యాస ప్రక్రియను పరిచయం చేస్తూ భాష పై అభిమానాన్ని తెలియజేస్తుంది ఈ పాఠ్యభాగం.


ప్రక్రియ పరిచయం

   ఈ పాఠ్యభాగం వ్యాస ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వుండడటం వ్యాస లక్షణం.


 కవిపరిచయం

   ఎవరిభాష వాళ్ళకు వినసొంపు పాఠ్యభాగ రచయిత డాక్టర్ సామల సదాశివ. తన స్వీయ అనుభూతులతో రచించిన ‘యాది’ అనే వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది ఈ పాఠ్యభాగం. సదాశివ గారు బహు భాషావేత్త. సంస్క్రతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, పార్సీ, మరాఠీ, భాషల్లో పండితుడు. ఇతను రచించిన ‘అమ్జద్ రుబాయీలు’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద రచనా పురస్కారం, ‘స్వరలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించాయి. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ డిగ్రీని ఇచ్చాయి. సామల సదాశివ గారు  తన స్వీయ అనుభూతులతో రచించిన ‘యాది’ అనే వ్యాస సంపుటి లోనిదే ఎవరిభాష వాళ్ళకు వినసొంపు అనే ఈ ప్రస్తుత పాఠ్యభాగం.


 విశిష్టత

  భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంత పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా విలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లోని గొప్పతనాన్ని బేరీజువేస్తూ, తెలుగుభాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తుందీ పాఠ్యభాగం.


పూర్వకథ/నేపథ్యం

   నాలుగేళ్ళు కూడా నిండని మన రచయిత సామల సదాశివ గారి మనుమరాలు లావణ్య ఒకనాడు ‘తాతా ! ఇగపటు నీ పాను జర్దా డబ్బి’. అని అచ్చమైన తెలుగు నుడికారంలో ఇగపటు అనగానే తన మనుమరాలికి ఈ ప్రాంతపు తీయని తెలుగు పట్టువడ్డ ఆనందంలో కొన్నాళ్ళ క్రిందట సంస్కృతాంధ్ర భాషల్లో, కావ్యవ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు; ‘ఆంధ్రబిల్హణ’ బిరుదాం కితుడైన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అన్నటువంటి- “వారీ! రామచంద్ర! ఇగపటు” అనే మాటలు యాదికి వచ్చి ప్రస్తుత పాఠ్యభాగమైన “ఎవరిభాష వాళ్ళకు వినసొంపు” అనే వ్యాసాన్ని రాయడానికి పూనుకుంటాడు.




సారాంశం

 సంస్కృతాంధ్రప్రాకృత భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ వారపత్రికలో హైదరాబాద్ నోట్ బుక్ అనే పేరుతో చివరి పేజీ రాసేవారు. అందులో ఒకనాడు రామచంద్ర గారి బాల్య మిత్రుడు సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' అనే కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తిరుపతికి వెళ్లి తెచ్చిన ఒక లడ్డూను రామచంద్ర గారికి ఇస్తూ "వారీ! రామచంద్రా! ఇగపటు తిరుపతి లడ్డూ" అని అన్న మాటలను పేర్కొన్నారు. లావణ్య మాటలు వినగానే సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

   లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వీరికుమార్తె ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కమలగారు. కమలగారు బాసరలో వ్యాసపూర్ణిమ నాడు ప్రసంగించారు. ఈమె మాట్లాడుతుంటే సదాశివగారికి లక్ష్మణశాస్త్రిగారు గుర్తుకువచ్చారు. శాస్త్రిగారు నిజాంకాలంలో సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో విరమణ పొందాడు.

     మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగిఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడుకు చెందినవారు. దీనిని నీళ్లులేని ఇటిక్యాలపాడు అనేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ లోని కొంతభాగం కర్ణాటకలో చేరిపోయింది. ఇటిక్యాలపాడు, ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు  ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మ గారు చురుకుగా పాల్గొన్నారు.

   నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్గొండలోని ఒక ఆశ్రమంలో వత్సలుడు మొదలైన కావ్యాలు రాసిన అంబటిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు. వీరు వేలూరి శివరామశాస్త్రి గారి శిష్యులు. సామల సదాశివ, కోడూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులు. అంబటిపూడి వారి ఒకకావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం పరిషత్ నిర్వహించే పరీక్షల సిలబస్ లో ఉండేవి.

               పలుకుబడి, నుడికారం, జాతీయాలను ఉర్దూలో రోజ్ మర్రా, మొహావిరా అంటారు. వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అనవచ్చు. టక్సాలీ అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ ఎక్కువ. డిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు.

         సదాశివ గా ఊరిలో మరాఠీపు రోహితుడు మొదట 'మీకండ్లకు నీళ్లు పెట్టుకోండి"అంటాడు. "కళ్ల నీళ్లు పెట్టుకోండి"అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీ నోటివెంట అచ్చ  తెనుగు నుడి వినిపిస్తుంది. ముస్లిం స్త్రీలు ఇల్లుదాటి వెళ్ళని వాళ్లు మాట్లాడేది శుద్ధమైన భాష రాజమహల్లలోఉండే బేగములు మాట్లాడేది శుద్ధమైన భాష. ఈ ఉర్దూను బేగమాతీ జుబాన్, మహెల్లాతీ జుబాన్ అంటారు. సామల చదువుకునే సమయంలో నిజాంకాలేజీలో ఆగా సాహెబ్ అనే ప్రొఫెసర్గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో మాట్లాడేవారు.

 వరంగల్లో పెద్ద కాలోజి వర్ధంతి సభలో సదాశివ పాల్గొన్నాడు. పెద్ద కాలోజీ కవి. ఇతని కలంపేరు షాద్. వర్ధంతి సభలో చిన్నపాటి కవి సమ్మేళనం జరిగేది. గాయకులు షాద్ గజల్లు పాడేవారు. సదాశివ గారు సభకు వెళ్ళే సరికి సాహితీ మిత్ర మండలి వాళ్ళు కవితా గానం చేస్తున్నారు. సభకు డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులు వేరే భాష పదాల జోలికి పోకుండా వరంగల్ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు. తర్వాత సామల తెలుగులో మాట్లాడే సాహసం చేయలేదు. ఉర్దూలోనే మాట్లాడాడు.

   సామల సదాశివ వార్తా పత్రికల్లో కొన్నాళ్లు ఉర్దూ కవుల గురించి రాశాడు. తర్వాత యాది రాశాడు. యాదిలో వచ్చిన వ్యాసాలను చదివి గుంటూరు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ మెచ్చుకునేవాడు. ఆంధ్రవాళ్ళు మెచ్చుకోవడం గొప్పేకదా.

   సదాశివ తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతివెంకన్నను కూడా చూడలేదు. కారా మాస్టారు గారి ఆజ్ఞతో మూడు రోజులు విశాఖ శ్రీకాకుళం వెళ్ళివచ్చాడు. సదాశివ తెలుగు పంతులు ఉర్దూ మరాఠీ పిల్లలు వ్యవహారిక భాషలోనే చదువుకునేవారు. ఒక టీవీ చానల్లో "తెలుగేరాయండి. తెలుగులోనే మాట్లాడండి" అని చెపుతున్నప్పుడు... అది విన్నప్పుడల్లా ఏతెలుగు? ఎక్కడితెలుగు? అని రెండు ప్రశ్నలు వేసుకునేవాడు.

  ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్. అతడు శుక్రవారం శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్లమీద కూర్చుండి ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి మాట్లాడు కుంటుంటే వాటిని శ్రద్ధగా విని ప్రజలపలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాడు. తఖీమీర్ నాది ప్రజా కవిత అన్నాడట.

 తఖీమీర్ గారి ఒక షేర్

 ‘గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్

పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సేహై’

  ఇందులో ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దాని బహువచనం ఖవాస్. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు.

 “ నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే అని పై షేర్ యొక్క అర్థం.”

 ఈ విధంగా సామల సదాశివగారు ఆయా ప్రాంతాల తెలుగును ఆయా ప్రాంతాలలోని భాషా సేవకులను, అభిమానులను గుర్తుచేసుకుంటూ ఉర్దూ భాషపై తనకు గల అభిమానాన్ని, పట్టును ప్రస్తావిస్తూ సాగించిన రచనే ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యభాగం.




Also Read  ........ 

తెలుగు వ్యాకరణం https://www.pravahini.in/p/blog-page_19.html
పాఠ్యపుస్తక వ్యాకరణము: https://www.pravahini.in/2021/07/p.html


0/Post a Comment/Comments