తండా తండాలో సేవాలాల్ దీక్షలు.. రచయిత రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా

తండా తండాలో సేవాలాల్ దీక్షలు.. రచయిత రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా

కొత్తపల్లి దీక్షభూమిలో సేవాలాల్ దీక్షలు ప్రారంభించిన దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని  కొత్తపల్లి హెచ్ దీక్ష భూమి  బంజారాల అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దీక్షభూమి పీఠాధిపతి అయిన సంత్ దీక్షగురు శ్రీ శ్రీ శ్రీ  ప్రేమ్ సింగ్ మహారాజ్  జగత్ జనని జగదాంబ దేవి భక్తుడు. ఇతని గురువు నిర్గుణ నిరంకారి బాల బ్రహ్మచారి,రాజగురు,   రాష్ట్రీయ సంత్, మహాన్ తపస్వి శ్రీ శ్రీ శ్రీ, డాక్టర్. రామారావు మహారాజ్ గారు
1978 లో అద్భుతమైన ఘటన:- 

శ్రీ, ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు  శంకర్ లొద్ది అనే పవిత్రమైన స్థలంలో ఒక సంవత్సరం కాలం పాటు భగవాన్ శంకరుని అనుగ్రహముతో తపస్సు చేసెను. శంకర్ లొద్దిలో  శివపురాణం ఆధారంతో భక్తి మార్గంలో నిమగ్నమైన మహారాజ్, గురువు సంత్ రామారావు మహారాజ్, జగదాంబ దేవికి ధూపదీపం పెట్టి అన్నపానీయాలు విడిచి రావి చెట్టు నీడలో దట్టమైన అరణ్యంలో నది ఒడ్డున సంవత్సరం కాలం పాటు ఆధ్యాత్మికంగా  తపస్సు చేసి దైవ సౌక్షాత్కారాన్ని పొందినారు. మాత జగదాంబ దేవి, రాజగురువు, శ్రీ రామారావు మహారాజ్ గారి కలలో ప్రత్యక్షమై ప్రేమ్ సింగ్ మహారాజ్ గురించి చెప్పడంతో  పౌరాఘడ్  పీఠాధిపతి అయిన సంత్ శ్రీ రామారావు మహారాజ్ గారు మహారాష్ట్రలోని వాసీం  జిల్లా  పౌరాదేవి ఆలయం నుండి తెలంగాణా రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలంలోని అనార్ పల్లి మీదుగా భక్తులతో  శంకర్ లొద్దికి చేరుకున్నారు.అక్కడ ప్రేంసింగ్ మహారాజ్ గారిని కలిసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని  తపస్సు నుంచి నిష్క్రమించాలని  చెప్పడంతో,
 ఆ అంతర్యామీ తపస్సు ద్వారా శ్రీ,రామారావు మహారాజ్ గారి ఆజ్ఞతో వరాలను పొందినారు.తపస్సు,మరియు ఆజ్ఞ వలన మహారాజ్ కు దివ్యమైన తేజస్సు ఉత్పన్నమైందని భక్తులు అంటారు.అప్పటి నుండి  జనవరి 11న  ప్రతి సంవత్సరం గురుకృప దినోత్సవం
 (గురుమిలన్ దివస్) దీక్షభూమి కొత్తపల్లి హెచ్ లో జరుపుకుంటారు. వేలాది మంది భక్తజన సందోహం మధ్య
అంగరంగా వైభవంగా మూడు రోజులు పాటు దీక్షభూమి యందు జాతర  నిర్వహిస్తారు.
ఈ గురుకృప దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర,  ఆంధ్ర ప్రదేశ్, మరియు తెలంగాణ మొదలగు రాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కు తీర్చుకొని మహారాజ్ ఆశీర్వాదం తీసుకుంటారు.
గురుకృప దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నార్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన భక్తులు సేవాలాల్ దీక్షభూమి వరకు భజనలు చేస్తూ బాజా బజంత్రీలతో పల్లకి మోస్తూ పాదయాత్రగా దీక్ష భూమి 
కొత్తపల్లిని చేరుకుంటారు.ఇది పౌరాదేవి తర్వాత బంజారా భక్తులకు అత్యంత పవిత్రమైన భూమిగా చెప్పవచ్చు.
41 రోజులు సేవాలాల్ దీక్షలు:-
------------------------------------------
సేవాలాల్ దీక్షలు శ్రీ సంత్ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ మొట్టమొదటి సారిగా  1992‌లో ప్రారంభించారు.  దీక్షభూమి కొత్తపల్లి నుండి పౌరాఘడ్ కు "సేవాదళ్ " పేరుతో  సుమారు యాభైవేల పైగా భక్తులను కాలినడకన గురు శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు పౌరాదేవికి తీసుకొని వెళ్ళటం గొప్ప విషయం.అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమిలో దీక్ష తీసుకొని పౌరాదేవి వెళ్తుతుంటారు.

బంజారాల కాశీ మహారాష్ట్రలోని పౌరాఘడ్ లో కొలువైవున్న బంజారాల ఆరాధ్యదైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి ను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా  ఇతర దేశాల నుంచి గోర్ బంజారా భక్తులు తరలి వెళ్తారు. మహాశివరాత్రి పర్వదినం మొదలు శ్రీరామ నవమి వరకు ఎటు చూసినా సేవాలాల్ దీక్షలు జై సేవాలాల్ నామస్మరణలు వీనులవిందు చేస్తాయి.చన్నీటి స్నానం, నేలమీద శయనం నిరాడంబర జీవనం గులాబీ వస్త్రధారణ, శాంతి స్వరూపాన్ని సేవాలాల్ దీక్షా పరులు పాటిస్తారు.
భక్తులు స్త్రీ, పురుషులు 41రోజులు దీక్ష  ప్రారంభించేటప్పుడు  తెల్లని ధోవతిలు, లుంగీలు, ప్యాంటు,  గులాబీ రంగు చొక్కలు,కమీజులు ధరించి నియమ నిష్ఠలతో కఠిన దీక్షకు పూనుకుంటారు. చన్నీటిస్నానం పాదరక్షలు వదిలేయడం, ఏకభుక్తం, అస్ఖలిత బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతనను కలిగివుంటారు.
 తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటంవలన మనోచైతన్యం కలుగుతుంది. మంచి మార్గానికి మళ్ళించే జీవనం మొదలై ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. చెడు వ్యసనాలకు దూరమై రెండు పూటలా స్నానం చేసి దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది. సాముహికంగా పూజలు భక్తి శ్రద్ధలతో భజన, కీర్తనలు చేస్తు  ఉదయం,సాయంత్రం హారతి ఇవ్వడం పూజ కార్యక్రమాలు చేస్తూ దైవ చింతనలో ఉండటం జరుగుతుంది.
సేవాలాల్ దీక్ష సమయంలో భక్తులు మాదకద్రవ్యాలు సేవించడం గాని అబద్ధాలు మాట్లాడడం గాని, అపకారాలు తలపెట్టే విధంగా కుట్రలు పన్నడం, దూషించడం, చెడు ఆలోచనలు పెట్టుకోవడం గాని ‌చేయరు.భక్తులు తాము స్వయంగా తయారు చేసిన వంటకాలు మాత్రమే భుజిస్తారు. అంటు ముట్టు ఐనా పానీయాలు సేవించరు. ఈ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినాన మొదలుకోని  శ్రీ రామనవమి వరకు కొనసాగుతుంది. శ్రీరామనవమి రోజున భక్తులు పౌరాదేవికి వెళ్ళి జగదాంబ మాతకు కానుకలు సమర్పించి మొక్కుచెల్లించి సేవాలాల్ దీక్షలు విరమిస్తారు. ఈ విధంగా భక్తి మార్గంలో  మహారాజ్ గారు  ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడం గమనార్హం.

(వ్యాసకర్త ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ)
రాథోడ్ శ్రావణ్
9491467715

0/Post a Comment/Comments