బంగారు తెలంగాణ - మార్గం కృష్ణ మూర్తి

బంగారు తెలంగాణ - మార్గం కృష్ణ మూర్తి

- మార్గం కృష్ణ మూర్తి

బంగారు తెలంగాణా

జయశంకర్ గారి సిద్ధాంతం
విద్యార్థుల ఆత్మ బలి దానం
కవుల , కళాకారుల వీర రంగం
ప్రజలు మేధావుల అంతర్మధనం
ఆరు దశాబ్దాల ఉధ్యమాల పోరాటం
ఆవిర్భవించే తెలంగాణ రాష్ట్రం!

నీటి బాధలు తగ్గుతుండే
కరెంట్  కోతలు లేకుండే
పొలాలకు నీరు పారుతుండే
పేదలకు కొంత ఆసరా అందుతుండే
పంపకాలకు పాలన విస్తరన జరుగుతుండే!

కానీ ,ఇచ్చిన హామీలు, అమలు గాక
పేదలకు  ఉపాధి లేక,ప్రజలను ఉచితాలకు
వారసులను చేసి, సోమరులుగా మార్చిరి
ఓటర్ల బలహీనతల నాడి నెరిగిరి
ఎలక్షన్లలో కోట్ల డబ్బు కుమ్మరించిరి!

తెలంగాణా నా రత్నాల వీణ
అనిన దాశరథి  మాటకు సార్ధకత ఏది?
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండే
రాష్ట్ర అప్పులేమో పెరుగుతుండే
తలసరి ఆదాయం తరుగుతుండే!

నిధులు నీళ్లు లేవు,నియామకాలు లేవు
ప్రజలు పనులు లేక,పస్తులుండే  
జన జీవనం అస్తవ్యస్తం
కుటుంబ పాలనతో,రాష్ట్రం ఉడుకుతుండే
రాజకీయ విభేదాలతో, అట్టుడుకు తుండే!

చిన్న వర్షం పడినా,రోడ్లపైన  వరదలు పొంగే
ఇండ్లల్లోన  నీరు నిండే,గ్రామాలు,నగరాలు
జల కళతో డబుల్ బెడ్ రూములు  డెల్లాస్ లామారే
అతలా కుతలం, జన జీవనం నీటి మయం

కరోనామహమ్మారి వచ్చే,కడగండ్లుపెట్టిస్తుండే
కుల వృత్తులు నిలిచిపోయే
గుడులు బడులు మూసివేసే
బ్రతుకు దెరువు కష్టమవుతున్నా
బార్లు బాగా తెరిచి పెట్టే

ధరణి పోర్టల్ వచ్చే,అవకతవకలు పెరిగే
భూముల కబ్జాలు జోరుగా జరుగుతుండే
బినామీ చట్టాలు నేతలకు చుట్టాలుగామారే
పేదలకు చివరకు బూడిద మిగులుతుండే!

కరోనా రోగాలతో  జనులు
డబ్బు ఊడ్చినట్లవుతుండే
అప్పులపాలవుతుండిరి
రోజూ జనులు కాటికి పోతుండిరి
ప్రజా జీవితం అస్త వ్యస్థమవుతుండే
నివురు కప్పిన నివురా జనం
ఓటుతో కాటు వేయ ఎదురు చూస్తుండే!

మేధావులు మేల్కొంటే
జనులు ఉచితాలకు లొంగి పోకుంటే
ఓటర్లు అవినీతి నేతల జాడిస్తే
కవులు కళాకారులు సమరశంఖం పూరిస్తే
వస్తుంది కోరుకున్న బంగారు తెలంగాణా
సార్ధకమవుతుంది దాశరథి కోటిరతనాల వీణ!

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments