మన తక్షణ కర్తవ్యం
పర్యావరణ పరిరక్షణే...
నింగిలోకి తొంగిచూసే రైతన్నలనడిగా...
మీ ఈ దుర్భరదుస్థితికి కారణమెవరని?
...కరగని కురవని నింగిలోని మేఘాలేననే...
నింగిలోన దాగిన మేఘాలనడిగా...
మీరెప్పుడు చిరుజల్లులుగా మరేదని?
...తమను తాకని చల్లగాలినడగమనె...
నీలాకాశంలో నల్లని చల్లగాలినడిగా...
మబ్బులతో ఎందుకు మీకు విరోధమని?
...స్వార్థంతో వాతావరణాన్ని కలుషితం
...చేస్తున్న మాయదారి మనుషులనడగమనె...
మాయదారి మనుషులనడిగా...
ఈ విషపూరిత వాతావరణ
కాలుష్యానికి కారణమెవరని?
...చట్టాలను, గట్టిశాసనాలు చేసినా
...కఠినంగా అమలు చేయలేకున్న
...అసమర్థ ప్రభుత్వాన్ని అడగమనె...
అసమర్దప్రభుత్వాన్ని ఘాటుగానే ప్రశ్నించా...
పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎవరిదని?
...మంచిచెబితే....వినని....మారని....ప్రజలేదేననె
...వారికి మంచిబుద్దినివ్వని ఆ భగవంతుడేదేననె
ఆపై భగవంతుని పాదపద్మాలను
కన్నీటితో కడిగా... ఆర్తితో అడిగా...
కన్నుమిన్ను గానక భూవాతావరణాన్ని
కలుషితంచేసి పంచభూతాల ఆగ్రహానికి గురైన
...ఈ మనిషి జన్మకు అర్థం పరమార్థమేమిటని?
...పొంచివున్న ఈ పెనుప్రమాదానికి
...ఈ విధ్వంసానికి ఈ వినాశనానికి అంతమెప్పుడని?
విశ్వవాణి ఓ సందేశాన్నందించిందిలా!
మనిషి తన స్వార్థాన్ని విడనాడినప్పుడేనని...
ప్రకృతి ధర్మాలకు నియమాలకు కట్టుబడి పరుల
శ్రేయస్సును...ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించినప్పుడేనని
మానవత్వమే దైవత్వంగా భావించి జీవించినప్పుడేనని
అప్పుడర్థమైంది ఈ ఘోరవిపత్తుకు కారణం మనిషేనని
మనందరి...తక్షణ కర్తవ్యం.....పర్యావరణ పరిరక్షణేనని
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502