కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

కవిత పోలయ్య కవి ప్రచురించ ప్రార్థన

భగవద్గీత - ఓ అక్షయపాత్ర ఓ అమృతభాండం

"సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః పార్ధో 
వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్"...

ఔను అర్జునుడే ఆవుదూడకాగ  
ఉపనిషత్తులే గోవులుకాగ 
గోపాలబాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ పితికి 
సకల మానవాళికి అందించిన...
ఓ క్షీరధారే...ఈ గీతామృతం

పాండవుల కౌరవుల కురుక్షేత్ర రణరంగంలో 
అర్జునుని రథసారథి శ్రీకృష్ణపరమాత్మ 
హృదయక్షేత్రంలో ఉద్భవించిన...
ఓ అమృతభాండమే...ఈ గీతోపదేశం

ఎడారిలో ఎండమావే
నీటి కొలననే భ్రాంతిని తొలిగించేది 
ఆత్మజ్ఞానమని... 
జననమరణాలు లేదని మార్పులేనిది
ఆత్మేనని అది పరమసత్యమని...
ఆ ఆత్మే పరబ్రహ్మకు ప్రతిరూపమని
ఆత్మ నిజతత్వాన్ని గ్రహించే....
ఓ తారక మంత్రమే...ఈ భగవద్గీత

సత్వ రజ తమోగుణములకు  
కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గములే దివ్యమైన రాజమార్గములని ఘోషిస్తున్న...
ఓ మంత్రదండమే...ఈ భగవద్గీత

సంశయాలతో సతమతమై దుఃఖాగ్నికి దగ్ధమైపోయె
సృష్టిలోని సకల జీవరాశుల సమస్యల పరిష్కారానికి
ప్రతిఫలాలను ఆశించక సకర్మలను ఆచరించవలెనని 
అంతర్యామి కోటి సూర్యుల తేజోమయుడైన 
ఆ పరమాత్మను పార్థునివలె దివ్యదృష్టితో 
దర్శించవలెనని ప్రభోదిస్తున్న...
ఓ సుఖజీవన వేదమే...ఈ భగవద్గీత

దుష్టశిక్షణ శిష్టరక్షణ‌చేసే శ్రీకృష్ణపరమాత్మ
ధనుర్ధారి ధర్మపరాయణుడైన అర్జునుడున్నచోట
విజయాలు సిరి సంపదల గుప్తనిధులుండునని 
ఈ జీవితమే ప్రాపంచిక సుఖాల పరుగుపందెమని
సందేహల సమస్యల చింతల చీకట్ల విషవలయమని
శ్రీ కృష్ణపరమాత్మ పదసన్నిదే ఒక దివ్యమైన 
దేవాలయమని బోధించి మదినిదోచే...
ఓ మానస సరోవరమే...ఈ భగవద్గీత 

చేతిగీతను విధివ్రాతను  భాగ్యరేఖగా మార్చి 
మనిషి మనిషిలో మానవతాపరిమళాల్ని 
మానవీయ విలువల్నినింపే...
ఓ గాయత్రీమంత్రమే...భగవద్గీత 

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్



0/Post a Comment/Comments