సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే

సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే

 సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే

మానవ వికాసానికి, మనుగడకు ప్రధాన భూమిక పోషించే విద్య ప్రాధాన్యతను దాని విశిష్టతను తెలియజేసి శాస్త్రీయ దృక్పథంతో ఆనాటి సమాజంలో ఉన్న అసమానతలను వివక్షను రూపుమాపడానికి ఉద్యమించిన సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబాపూలే. 1827 వ సంవత్సరం ఏప్రిల్ 11 న జ్యోతిబా పూలే జన్మించారు. తన ఏడవ యేటనే బడి మానివేసిన పుస్తకాలంటే ఉన్న ఇష్టం తన తండ్రి స్కాటిష్ మిషనరీ పాఠశాలలో చేర్చడానికి కారణమైంది. 


ఆదిమానవుని కాలం నుండి ఆధునిక నాగరిక మానవుడి వరకు మానవ అభ్యున్నతికి కారణం అయినటువంటి విద్య దాని యొక్క విశిష్టతను గుర్తించిన జ్యోతిబా అట్టడుగు వర్గాల ప్రజల చైతన్యం కోసం విద్య ఒక్కటే ఆయుధమని అనేక పాఠశాలలు స్థాపించాడు. సమ సమాజ నిర్మాణం జరగాలన్నా, సాంఘిక రుగ్మతలను పారద్రోలన్నా ప్రజలకు అక్షరజ్ఞానం ముఖ్యమని పేర్కొన్నారు. అశేష జనావళికి జ్ఞాన వెలుగుల్ని కుల, మత, లింగ, వివక్ష లేకుండా ఉద్యమాల ద్వారా పోరాట స్ఫూర్తితో, నిమ్నవర్గాలకు అందించిన క్రాంతదర్శి, నవభారత నిర్మాత జ్యోతిబా పూలే. తాను స్వయంగా అనుభవించిన వివక్షను సమాజంలో ఇంకెవరికి రాకూడదని ఆనాటి వివక్ష అసమానతలు సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నడుం బిగించిన విప్లవ కెరటం. 


సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎనలేనిదని గుర్తించి స్త్రీలకు, బాలికలకు పాఠశాలలు స్థాపించారు. 13 వ యేటనే ఆనాటి సంప్రదాయం ప్రకారం ఎనిమిదేళ్ల సావిత్రిబాయితో వివాహం జరిగింది. అయితే సావిత్రిబాయి చదువుకోలేదు. ఆమెకు గురువై అక్షరజ్ఞానం అందించి ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబా పూలే ది. కేవలం విద్య మాత్రమే కాకుండా బడి మానివేసిన పిల్లల కోసం భోజన గృహ వసతి కల్పించారు సమాజంలో నిరాదరణకు గురైన మహిళలకు అండగా నిలబడ్డారు. 


విద్య హక్కు వ్యాప్తికై ప్రచారం చేయడం, పిల్లల మానసిక వికాసం పై దృష్టి పెట్టడం మరియు రైతులు, వెనుకబడిన తరగతుల వారి కోసం, కార్మికుల కోసం రాత్రి పాఠశాలలు నడిపారు, మద్యపాన నిషేధం పై, కుల వ్యవస్థపై దళితులు ఉద్యమించారు. 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. 


జ్యోతిబా రాసిన గులాంగిరి, సత్సార్,పుస్తకాలు సమాజాన్ని చైతన్యవంతం చేసేవే. ఇవే కాకుండా అనేక కవితలు, పద్యాలు, జానపద గేయాల ద్వారా ఆనాటి సమాజంలో ఆలోచన రేకెత్తించారు. కేవలం నిమ్న వర్గాల ప్రజల కోసం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఒక మానవతావాదిగా ప్రతిస్పందించారు సతీసహగమనం బాల్య వివాహాలను వ్యతిరేకించారు. ఈ భూమిమీద పుట్టిన ప్రతి మనిషికి సమానమైన హక్కులు ఉంటాయని సమాజంలో స్త్రీ, పురుషుల పాత్ర సమానమేనని ఆ దిశగా సమాజాన్ని అక్షరాల దారుల్లో నడిపిన మహామహోపాధ్యాయుడు జ్యోతిబా పూలే. తమ కోసం కాకుండా సమాజం కోసం జీవించేవారు మహనీయులు. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ జాగృతం చేయడానికి తమ జీవితాల్ని త్యాగం చేసిన ఎందరో మహనీయులు వారిలో అగ్రగణ్యులు జ్యోతిబాపూలే. జగ్జీవన్ రామ్ జన్మించిన అంబేద్కర్ గారు, జ్యోతిబాపూలే గారు ఈ ఏప్రిల్ మాసం మహనీయుల మాసం. 


జ్యోతిబా స్ఫూర్తి, చైతన్యంతో ముందుకు సాగుదాం. ఆయన ఆశయాలను ఆవాహన చేసుకుందాం. పూలే అందించిన జ్వాలతో ఆ చేతనత్వం తో ఉన్న అశేష జనవాహిని బహుజనుల మైన మనం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుదాం. సమున్నత లక్ష్యంతో, సాధికారత వైపు అడుగులు వేస్తూ పూలే ఆశయాలను సాకారం చేసుకుందాం 



తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్),

MA(టెల్), M.Ed, UGC NET,

రాజన్న సిరిసిల్ల జిల్లా.

0/Post a Comment/Comments