10th_SA 1_తెలుగు_స్టడీ మెటీరియల్ - రాజేంద్ర, 90101 37504

10th_SA 1_తెలుగు_స్టడీ మెటీరియల్ - రాజేంద్ర, 90101 37504

 సంగ్రహణాత్మక మూల్యాంకనం

10వ తరగతి SA 1 - తెలుగు స్టడీ మెటీరియల్


మాసు రాజేందర్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపర్తి,
మండలం: నడికూడ, జిల్లా: హనుమకొండ-506 164

WhatsApp No : 90101 37504, 63023 24734;

e-Mail : rajendersir.mass@gmail.com

Website: https://www.pravahini.in

10/10 కొరకు చదవాల్సినవి

కవి పరిచయం- పాఠం పేరు, రచయిత పేరు, రచనాశైలి, పాఠ్యాంశ స్వీకారం, విశేషాంశాలు గుర్తుంచుకోవాలి.
ప్రక్రియ పరిచయం- పాఠ్యాంశం ఏ సాహిత్య ప్రక్రియకు చెందిందో తెలిపి ఆ ప్రక్రియ లక్షణాలను తెలపాలి.
కంఠస్థ పద్యాలు- పువ్వుగుర్తుగల పద్యాలు కంఠస్థం చేయాలి. పద్యాలను పాదభంగం లేకుండా రాయగలగాలి. పద్యాల ప్రతి పదార్థం, భావం సొంతంగా రాయాలి.
పదజాలం- సొంత వాక్యాలు, అర్థాలు, పర్యాయపదాలు, నానార్ధాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు చదవాలి మరియు గుర్తుంచుకోవాలి.
వ్యాకరణాంశాలు- సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య, సంయుక్త,  సంశ్లిష్ట వాక్యాలు మరియు ప్రాచీనం నుండి ఆధునిక వచనంలోకి మార్చడం. ఇవి తప్పకుండా నేర్చుకోవాలి.
ఉపవాచకం- ఏ కాండంలో కథ ఎంతవరకు ఉంటుందో గుర్తుంచు కోవాలి. కథను సొంతంగా, సంక్షిప్తంగా రాయగలగాలి.
పద విజ్ఞానం- పుస్తకం చివరన ఉండే భాగం పూర్తిగా చదవాలి. గుర్తుంచుకోవాలి.
శతకాలు- పాఠ్య పుస్తకంలో లేని కొన్ని శతకాలు వాటి రచయితల పేర్లు, మకుటం, పద్యాలలోని పదాల అర్థాలు, భావాలపై అవగాహన కలిగి వుండాలి.
సృజనాత్మక అంశాలు- సంభాషణ, లేఖా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, వ్యాసం, కరపత్రం, సన్మాన పత్రం/అభినందన పత్రం, నినాదాలు తయారుచేయడం, గేయ రచన, వర్ణన మొదలైనవి రాయగలగాలి.
సారాంశాలు- అన్నిపాఠ్యభాగ సారాంశాలు సొంతమాటల్లో రాయగలగాలి.

* ఒక అకాడమిక్ ఇయర్ లో నాలుగు FAలు, రెండు SAలు ఉంటాయి.
ఒక్కొక్క FA 20 మార్కులు. SA 80 మార్కులు. మొత్తం 100 మార్కులు
నాలుగు FAల మార్కులు 80... వీటిని 20కి లెక్కిస్తారు. ఈ మార్కులు పబ్లిక్ పరీక్షలో వచ్చే మార్కులతో కలుపుతారు.

FA =   20 Marks (Internal) 
SA =   80 Marks (External)
Total =  100 Marks (Final Result)
Minimum Pass Marks: 35/100
Compulsory Pass Marks in SA: 28/80 
(then 7 Marks need from FA)

సంగ్రహణాత్మక మూల్యాంకనం (Summative Assessment)

80 మార్కులు
పేపర్ 1 - 40  మార్కులు - సమయం 2.45 గం.
పేపర్ 2 - 40  మార్కులు - సమయం 2.45 గం.

పేపర్ 1
ప్రశ్నాపత్రం చదవడానికి మొదటి 15 ని.
పార్ట్ ఎ 30 మార్కులు సమయం 2:00 గం.
పార్ట్ బి 10 మార్కులు సమయం 0:30 ని.

పేపర్ 2
ప్రశ్నాపత్రం చదవడానికి మొదటి 15 ని.
పార్ట్ ఎ 30 మార్కులు సమయం 2:00 గం.
పార్ట్ బి 10 మార్కులు సమయం 0:30 ని.

*పార్ట్ ఎ లోని ప్రశ్నలకు సమాధానాలు రాసే సమయం మరియు మార్కులు
పార్ట్ ఎ - మార్కులు 30 - సమయం 2:00 గం. - అంటే 120 ని. - 120/30=4 అనగా

4నిమిషాలకు           1మార్కు
8నిమిషాలకు   2మార్కులు
12నిమిషాలకు         3మార్కులు
16నిమిషాలకు   4మార్కులు
20నిమిషాలకు   5మార్కులు
24నిమిషాలకు   6మార్కులు

(సులభంగా సమాధానం రాయగల ప్రశ్నలను ముందుగా ఎంచుకుని జవాబు రాసి, సమయం మిగుల్చుకుని కఠినమైన  ప్రశ్నలకు ఆలోచించి జవాబులు రాయాలి. రాయాల్సిన అన్ని ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నం చేయాలి.)

పేపర్ 1

మార్కులు 40 - సమయం 02:45 గం.

పార్ట్ ఎ
మార్కులు 30 - సమయం 2:00 గం. (ఇందులో రెండు సెక్షన్ లు వుంటాయి)

I. వ్యక్తీకరణ - సృజనాత్మకత (స్వీయ రచన)

అ)   ఇందులో వచ్చే ప్రశ్నలకు ఐదు వ్యాక్యాలలో జవాబులు రాయాలి. 4×3=12
మార్కులు 12 ....    4×3=12  -  సమయం: 48నిమిషాలలో పూర్తిచేయాలి.
ఇందులో 1-4 వరకు 4ప్రశ్నలు వుంటాయి.
ఒక్కొక్క ప్రశ్నకు 3మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
నాలుగింటిలో రెండు ప్రశ్నలు పద్య భాగం నుండి 
రెండు ప్రశ్నలు గద్య భాగం నుండి వస్తాయి.
ఇందులో కవి పరిచయానికి సంబంధించి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది.   

ఆ) ఇందులో వచ్చే ప్రశ్నలకు పది వ్యాక్యాలలో జవాబులు రాయాలి.   3×6=18
మార్కులు 18 ...   3×6=18  -  సమయం: 72నిమిషాలలో పూర్తిచేయాలి.
5-7 వరకు 3 ప్రశ్నలు వుంటాయి.ప్రతి ప్రశ్న అంతర్గ అవకాశాన్ని కలిగి వుంటుంది.
ఒక్కొక్క ప్రశ్నకు 6మార్కులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
పద్య భాగం నుండి ఒక ప్రశ్న, గద్య భాగం నుండి ఒక ప్రశ్న, 
ఉప వాచకం నుండి ఒక ప్రశ్న ఇవ్వబడుతుంది.

పార్ట్ బి
II. భాషాంశాలు (పదజాలం)         మార్కులు 10  - సమయం 30ని.
ఇందులో మెత్తం ప్రశ్నలు 18
అన్ని ప్రశ్నలు పదజాలాంశముల నుండే వస్తాయి.
1,2 ప్రశ్నలు సొంత వాక్యాలు 2×1=2
3-18 వరకు 16 ప్రశ్నలు. 16× 1/2=8
అర్థాలు, పర్యాయపదాలుల, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్యర్థాలు నుండి 
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వుంటాయి.

పేపర్ 2

మార్కులు 40  సమయం 2:45 గం.

పార్ట్ ఎ
మార్కులు 30 - సమయం 2:00 గం. (ఇందులో రెండు సెక్షన్ లు వుంటాయి)

I.అవగాహన - ప్రతిస్పందన (చదవడం - అవగాహన చేసుకుని రాయడం)
మార్కులు 20 ...  4×5=20  -  సమయం: 80నిమిషాలలో పూర్తిచేయాలి.

అ) పరిచిత గద్యం - 5మార్కులు - సమయం: 20ని.
ఉపవాచకం నుండి కొంత గద్యం ఇవ్వబడుతుంది. గద్యం కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి వాటికి ఐదింటికి సమాధానాలు రాయాలి.
ఆ) అపరిచిత గద్యం - 5 మార్కులు - సమయం: 20ని.
తెలియని గద్యము ఇచ్చి దాని కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి.
అన్నింటికీ సమాధానాలు రాయాలి.
ఇ) పరిచిత పద్యం - 5మార్కులు - సమయం: 20ని.
కంఠస్థ పద్యాలు లో నుండి ఇవ్వబడుతుంది పద్యం ఇస్తే ప్రతి పదార్థం రాయాలి లేదా 
పద్య పురాణం పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించాలి భావాన్ని కూడా రాయాలి.
ఇ) అపరిచిత పద్యం - 5మార్కులు - సమయం: 20ని.
తెలియని పద్యం అంటే పాఠ్యపుస్తకాలలో లేని పద్యం ఇవ్వబడుతుంది. 
దాదాపుగా శతక పద్యం వస్తుంది. దాని కింద ఐదు ప్రశ్నలు ఇవ్వబడతాయి. 
అన్నింటికీ సమాధానాలు రాయాలి.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత (సృజనాత్మకత)
మార్కులు 10 ....   2×5=10  -  సమయం: 40 నిమిషాలలో పూర్తిచేయాలి.

ఇందులో 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. రెండింటికి సమాధానాలు రాయాలి. 
ఈ సెక్షన్ కింద సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు వుంటాయి. 
ఉదా. సంభాషణ, లేఖా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, వ్యాసం, కరపత్రం, సన్మాన పత్రం/అభినందన పత్రం, నినాదాలు తయారు చేయడం, గేయ రచన, వర్ణన మొదలైనవి. 

పార్ట్ బి
III. భాషాంశాలు (వ్యాకరణం)           మార్కులు 10 - సమయం 30ని.
వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 
ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి.
సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు, కర్తరి కర్మణి వాక్యాలు, సామాన్య సంయుక్త  సంశ్లిష్ట వాక్యాలు మరియు ప్రాచీనం నుండి ఆధునిక వచనంలోకి మార్చడం లాంటి విభాగాల నుండి ప్రశ్నలుంటాయి.

ఆల్ ద బెస్ట్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్

ప్రశ్నాపత్రం ఇవ్వగానే పూర్తిగా చదవాలి.
సమాధానాలు మంచిగా రాయగల ప్రశ్నలని ఎంపిక చేసుకోవాలి.
సాధ్యమైనంత వరకు సమాధానాలు వరుసక్రమంలో రాయడం మంచిది.
ఛాయిస్ లు పోగా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి.
ప్రశ్నను బట్టి మార్కులకు అనుగుణంగా సమాధానాలు రాయాలి. 
సమయ పాలన (time adjustment) చాలా ముఖ్యం.
పరీక్ష హాలులో ప్రతీ క్షణం ఎంతో విలువైనది. సమయం వృధాచేయకూడదు.
తెలుసు కదా అని జవాబు ఎక్కువగా రాయకూడదు.
సమాధాన పత్రంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.
హాండ్ రైటింగ్ చక్కగా ఉండాలి.
బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి.

కవి పరిచయం -  పద్య, గద్యభాగ పాఠ్యాంశాల కవిపరిచయాలు చదవాలి.
కంఠస్థ పద్యాలు - దానశీలము, వీరతెలంగాణ, భిక్ష పాఠాలలో గల తొమ్మిది పువ్వు గుర్తు గల పద్యాలను, భావాలను, ప్రతిపదార్థాలను కంఠస్థం చేయాలి మరియు సొంతంగా రాయగలగాలి.
సారాంశాలు - అన్నింటికంటే ముఖ్యం 12 పాఠాల సారాంశాలు తెలిసివుండాలి. వాటిని ఆధారం చేసుకుని ఇచ్చిన ప్రశ్నలకు సొంతమాటల్లో సమాధానాలు రాయాలి.
సృజనాత్మకత - లేఖ, వ్యాసం, సంభాషణా రచన, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, నినాదాలు, కరపత్రం,  మొదలైన సృజనాత్మక అంశాలు రాయడం తెలియాలి.
ఉపవాచకం - రామయాణములో గల ఆరు కాండములలో ఏ కాండంలో కథ ఎంతవరకు ఉందో గుర్తుంచుకోవాలి. ముఖ్య పాత్రలు, సంఘటనలు గుర్తుంచుకోవాలి.
పదజాలం - అన్ని పాఠాలలోని పదజాల అంశాలను చదవాలి. వీటితో పాటు పాఠ్యపుస్తకం చివరన గల పదవిజ్ఞానం కూడా చదవాలి.
వ్యాకరణాంశాలు - సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు. కర్తరీ, కర్మణీ వాక్యాలు. ప్రత్యక్ష, పరోక్ష కథనాలు. ప్రాచీన భాష నుండి వ్యావహారిక భాష లోకి మార్చడం. మొదలైన వాటిని అభ్యసించాలి.

(గమనిక: మీరు 100శాతం తెలుగు పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. ఇక మీరు చేయాల్సింది ఏమాత్రం భయపడకుండా పరీక్ష రాసి 10/10సాధించడమే. ఇన్ని రోజులు చదివింది ఒకెత్తు. ప్రశాంతంగా పరీక్ష రాయండి. ప్రశ్నాపత్రం చదవండి. జవాబులు గుర్తుచేసుకోండి. అద్భుతంగా రాయండి)

కవి పరిచయాలు

‘దానశీలము’ - బమ్మెర పోతన

దానశీలము అనే ఈ పాఠ్యభాగ రచయిత బమ్మెర పోతన. ఇతను 15వ శతాబ్దానికి చెందిన వాడు. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతనకు సహజ పండితుడు అని బిరుదు గలదు. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం మొదలగునవి రచించాడు. ఇతను రచించిన శ్రీమత్ భాగవతం అష్టమ స్కంధంలోని వామన చరిత్ర నుండి ఈ పాఠ్యభాగం  స్వీకరించబడింది. భాగవతము పురాణ ప్రక్రియకు చెందినది.

‘ఎవరిభాష వాళ్ళకు వినసొంపు’ - డాII సామల సదాశివ

‘ఎవరిభాష వాళ్ళకు వినసొంపు’ పాఠ్యభాగ రచయిత   డాII సామల సదాశివ. సదాశివ గారు బహు భాషావేత్త. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పండితుడు. ఇతను రచించిన ‘అమ్జద్ రుబాయీలు’ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాద రచనా పురస్కారం, ‘స్వరాలయలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. కాకతీయ, తెలుగు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ డిగ్రీని ఇచ్చాయి. సామల సదాశివ గారు తన స్వీయ అనుభూతులతో రచించిన “యాది” అనే వ్యాస సంపుటిలోనిదే ‘ఎవరి భాష వాళ్ళకు వినసొంపు’ అనే ఈ ప్రస్తుత  పాఠ్యభాగం.

‘వీర తెలంగాణ’ - దాశరథి కృష్ణమాచార్య

ఈ పాఠ్యభాగ రచయిత దాశరథి కృష్ణమాచార్య. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన ఉద్యమ వీరుడు. ‘ముసలి నక్కకు రాచరికంబు తగునే’ అంటూ నిజాంను వ్యతిరేకించి జైలు పాలైన ధీరుడు దాశరథి కృష్ణమాచార్య. జైలుకు వెళ్ళి జైలు గోడల మీద కుడా నిజాంకు వ్యతిరేకంగా పద్యాలు రాసాడు.  తెలుగు సాహిత్యానికి ఇతడు చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి.

తెలుగులో గజల్ ప్రక్రియకు ఆద్యుడు దాశరథి.గాలిబ్ గజళ్ళను తెలుగులోకి అనువదించాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు, నవమి, యాత్రాస్మృతి వ్మోదలైనటువంటి గ్రంథాలను, ఆణిముత్యాల వంటి సినిమా పాటలను రచించాడు. ఈ పాఠ్యభాగం వీర తెలంగాణ డా. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన దాశరథి సాహిత్యం ఒకటవ సంపుటి రుద్రవీణ నుండి గ్రహించబడింది.

‘కొత్తబాట’ - పాకాల యశోదారెడ్డి

కొత్తబాట అనే ఈ పాఠ్యభాగ రచయిత పాకాల యశోదారెడ్డి గారు. ఈవిడ ‘తెలుగులో హరివంశాలు’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. యశోదారెడ్డి గారు రాష్ట్ర అధికారభాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ ఎంతో ప్రజాదరణ పొందింది. ఇంకా ఎన్నో పరిశోధనా గ్రంథాలను మరియు కథా సంపుటాలను వెలువరించారు. కొత్తబాట పాఠ్యభాగం ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ వారు ప్రచురించిన ‘యశోదారెడ్డి ఉత్తమ కథలు’ అనే గ్రంథం నుండి గ్రహించబడింది.

‘నగరగీతం’ - అలిశెట్టి ప్రభాకర్

నగరగీతం పాఠ్యభాగ రచయిత అలిశెట్టి ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్ రచించిన ‘అలిశెట్టి ప్రభాకర్ కవిత’ అనే గ్రంథంలోని ‘సిటీ లైఫ్’ అనే మినీ కవితలలో కొన్నిటిని ‘నగరగీతం’ గా కూర్చడం జరిగింది.

జగిత్యాల జిల్లా జగిత్యాల ఇతని జన్మస్థలం. మొదట చిత్రకారుడుగా జీవితం ప్రారంభించి, కవిత్వరంగంలోకి ప్రవేశించి, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్ లలో స్టూడియోలను ఏర్పాటు చేసుకొని జీవికకోసం ఫోటోగ్రాఫర్ గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఎన్నడు సంపాదన కొసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మాడు.

‘భాగ్యోదయం’ - కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్

ఈ పాఠ్యభాగ రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన ‘భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర’ గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం. 

కృష్ణస్వామి ముదిరాజ్ రాజకీయ వేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, సమాజ సంస్కర్త. 1957 లో హైదరాబాద్ నగరమేయర్ గా ఎన్నికై నగరాభివృద్ధికోసం రాబోయే ముప్ఫైఏండ్ల అవసరాలకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేసిన దార్శనికుడు. ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించాడు. హైదరాబాద్ నగరాన్ని చాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు. 

1948లో ఉర్దూలో ‘హైదరాబాద్-కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే ‘భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర’ రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. “తన మిత్రుడు భ్యాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసాడు.”

భావం: 
   దాతలలో గొప్పవాడా ! ఓ బలి చక్రవర్తీ ! నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ, నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు గీనం  వద్దు.  ఈ  బ్రహ్మచారిని (వామనుడిని)  పంపించు.


1. దానశీలము-2

*శా.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా !

భావం: ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా సరే. బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం  వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే. ఏమైనా కానీ, ఏదైనా రానీ! ఎందుకు ఇన్ని మాటలు. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే. నా నాలుక వెనుదిరుగదు. (ఆడిన మాట తప్పను).


3. వీర తెలంగాణ-1

*ఉ.    
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్!
ప్రాయము వచ్చినంతనె కృపాణములిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్
చేయుమటంటి; వీ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో!

భావం: ఈ తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తి బట్టి ఎదిరించింది. తాను గొప్పరాజునని అనుకునే వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడి పోయింది. దిగంతాల నీ ఆకాశంలో ఇంద్రధనస్సుల వరుసలతో సయ్యాట లాడాయి.

3. వీర తెలంగాణ-3

*మ    
తెలంగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా!

భావం:  అమ్మా తెలంగాణా! నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా.

సారాంశాలు

1.  దానశీలము

  శుక్రాచార్యుడు - దాతలలో గొప్పవాడవైన ఓ బలిచక్రవర్తీ! వచ్చినటువంటి వామనుడు ఆ పొట్టివాడు సామాన్యుడుకాడు. మూడు అడుగులతో ముల్లోకాల్ని కొలవగలడు. అతడిని ఎవరూ ఆపలేరు. నా మాట విను. దానం వద్దు గీనం వద్దు. ఆ బ్రహ్మచారియైన వామనుని పంపించు.  అని  బలిచక్రవర్తి  తో  అంటాడు.
   అప్పుడు బలిచక్రవర్తి.... ఓ మహాత్మా! ఇచ్చినమాటతప్పడంకన్నా పాపం లేదు. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి పంపించలేను. మాటకు కట్టువడి సత్యంతో బ్రతకడమే మానధనులకు మేలైన మార్గం. పూర్వం రాజులులేరా? రాజ్యాలు లేవా? వారేమైనా మూటగట్టుకొని పోయారా? అడిగిన వారికి లేదనకుండా దానం చేసిన శిబిలాంటి కొందరిని మాత్రమే  ఈలోకం  గుర్తుంచుకుంది. 
   ఓ పండితోత్తమా! నాకు నరకం దాపురించినా, బంధనం ప్రాప్తమైనా, ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా ఏది ఏమైనా కానీ! ఇన్ని మాటలు ఎందుకు వచ్చినవాడు విష్ణువు, శివుడు,బ్రహ్మ ఎవరైనా సరే ఆడినమాట తప్పను.
  ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, మరణమే సంభవించినా అభిమానధనులు మాట తప్పలేరు. అని బలిచక్రవర్తిఅంటుండగా భర్త సైగను గ్రహించిన అతని భార్య వింధ్యావళి ఆ వామనుడి కాళ్ళు కడగడానికి బంగారు కలశంలో నీళ్ళు తీసుకుని వన్తుంది. అప్పుడు బలిచక్రవర్తి వామనున్ని పిలిచి లేవయ్యా! ఇటురా! నీవు అడిగింది లేదనకుండా ఇస్తాఅంటూ అతడి పాదాల్ని కడిగి పూజించి నీకు మూడు అడుగుల నేలను దానం  చేస్తున్నానంటూ చేతిలో నీటిని ధారవోసాడు. అదిచూసి లోకం ఆశ్చర్యపడింది. పది దిక్కులూ, పంచభూతాలు “బళి బళి” అని పొగడాయి.

2. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు

సంస్కృతాంధ్రప్రాకృత భాషల్లో పండితుడైన తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ వారపత్రికలో హైదరాబాద్ నోట్ బుక్ అనే పేరుతో చివరి పేజీ రాసేవారు. అందులో ఒకనాడు రామచంద్ర గారి బాల్య మిత్రుడు సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన 'విక్రమాంకదేవ చరిత్ర' అనే కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు తిరుపతికి వెళ్లి తెచ్చిన ఒక లడ్డూను రామచంద్ర గారికి ఇస్తూ "వారీ! రామచంద్రా! ఇగపటు తిరుపతి లడ్డూ" అని అన్న మాటలను పేర్కొన్నారు. లావణ్య మాటలు వినగానే సదాశివ గారికి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
   లక్ష్మణశాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి చెందినవారు. వీరికుమార్తె ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ కమలగారు. కమలగారు బాసరలో వ్యాసపూర్ణిమ నాడు ప్రసంగించారు. ఈమె మాట్లాడుతుంటే సదాశివగారికి లక్ష్మణశాస్త్రిగారు గుర్తుకువచ్చారు. శాస్త్రిగారు నిజాంకాలంలో సమాచార పౌరసంబంధాల శాఖలో అసిస్టెంట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ పదవిలో విరమణ పొందాడు.
     మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగిఉంటుంది. సురవరం ప్రతాపరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడుకు చెందినవారు. దీనిని నీళ్లులేని ఇటిక్యాలపాడు అనేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూర్ లోని కొంతభాగం కర్ణాటకలో చేరిపోయింది. ఇటిక్యాలపాడు, ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయాయి. ఆలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటుకు  ముఖ్య కారకులైన గడియారం రామకృష్ణశర్మ గారు చురుకుగా పాల్గొన్నారు.
   నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనదే నల్గొండలోని ఒక ఆశ్రమంలో వత్సలుడు మొదలైన కావ్యాలు రాసిన అంబటిపూడి వెంకటరత్నం గారు అనే కవి ఉండేవారు. వీరు వేలూరి శివరామశాస్త్రి గారి శిష్యులు. సామల సదాశివ, కోడూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులు. అంబటిపూడి వారి ఒకకావ్యం కప్పగంతుల వారి సంక్షిప్త వ్యాకరణం పరిషత్ నిర్వహించే పరీక్షల సిలబస్ లో ఉండేవి
  పలుకుబడి, నుడికారం, జాతీయాలను ఉర్దూలో రోజ్ మర్రా, మొహావిరా అంటారు. వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని అనవచ్చు. టక్సాలీ అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకే విలువ ఎక్కువ. డిల్లీ ఉర్దూను టక్సాలీ ఉర్దూ అంటారు.
 సదాశివ గా ఊరిలో మరాఠీపు రోహితుడు మొదట 'మీకండ్లకు నీళ్లు పెట్టుకోండి"అంటాడు. "కళ్ల నీళ్లు పెట్టుకోండి"అనడు. ఇది టంకసాల బయట తయారైన నకిలీ నాణెం. వరంగల్లో కూరగాయలు అమ్మే స్త్రీ నోటివెంట అచ్చ  తెనుగు నుడి వినిపిస్తుంది. ముస్లిం స్త్రీలు ఇల్లుదాటి వెళ్ళని వాళ్లు మాట్లాడేది శుద్ధమైన భాష రాజమహల్లలోఉండే బేగములు మాట్లాడేది శుద్ధమైన భాష. ఈ ఉర్దూను బేగమాతీ జుబాన్, మహెల్లాతీ జుబాన్ అంటారు. సామల చదువుకునే సమయంలో నిజాంకాలేజీలో ఆగా సాహెబ్ అనే ప్రొఫెసర్గంటలు గంటలు దిల్లీ బేగమాతీ జుబాన్లో మాట్లాడేవారు.
 వరంగల్లో పెద్ద కాలోజి వర్ధంతి సభలో సదాశివ పాల్గొన్నాడు. పెద్ద కాలోజీ కవి. ఇతని కలంపేరు షాద్. వర్ధంతి సభలో చిన్నపాటి కవి సమ్మేళనం జరిగేది. గాయకులు షాద్ గజల్లు పాడేవారు. సదాశివ గారు సభకు వెళ్ళే సరికి సాహితీ మిత్ర మండలి వాళ్ళు కవితా గానం చేస్తున్నారు. సభకు డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులు వేరే భాష పదాల జోలికి పోకుండా వరంగల్ ప్రాంతీయ తెలుగులో మాట్లాడాడు. తర్వాత సామల తెలుగులో మాట్లాడే సాహసం చేయలేదు. ఉర్దూలోనే మాట్లాడాడు.
   సామల సదాశివ వార్తా పత్రికల్లో కొన్నాళ్లు ఉర్దూ కవుల గురించి రాశాడు. తర్వాత యాది రాశాడు. యాదిలో వచ్చిన వ్యాసాలను చదివి గుంటూరు అడ్వకేట్ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ మెచ్చుకునేవాడు. ఆంధ్రవాళ్ళు మెచ్చుకోవడం గొప్పేకదా.
   సదాశివ తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతివెంకన్నను కూడా చూడలేదు. కారా మాస్టారు గారి ఆజ్ఞతో మూడు రోజులు విశాఖ శ్రీకాకుళం వెళ్ళివచ్చాడు. సదాశివ తెలుగు పంతులు ఉర్దూ మరాఠీ పిల్లలు వ్యవహారిక భాషలోనే చదువుకునేవారు. ఒక టీవీ చానల్లో "తెలుగేరాయండి. తెలుగులోనే మాట్లాడండి" అని చెపుతున్నప్పుడు... అది విన్నప్పుడల్లా ఏతెలుగు? ఎక్కడితెలుగు? అని రెండు ప్రశ్నలు వేసుకునేవాడు.
  ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీమీర్. అతడు శుక్రవారం శుక్రవారం దిల్లీ జామె మసీదు మెట్లమీద కూర్చుండి ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు కూర్చుండి మాట్లాడు కుంటుంటే వాటిని శ్రద్ధగా విని ప్రజలపలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాడు. తఖీమీర్ నాది ప్రజా కవిత అన్నాడట.
 తఖీమీర్ గారి ఒక షేర్
 ‘గో మెరే షేర్ హైఁ ఖవాస్ పసంద్
పర్ మెరీ గుఫ్తగూ అవామ్ సేహై’
  ఇందులో ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దాని బహువచనం ఖవాస్. ఆమ్ అంటే సామాన్యం. ఆవామ్ అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. “ నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే అని పై షేర్ యొక్క అర్థం.”
 ఈ విధంగా సామల సదాశివగారు ఆయా ప్రాంతాల తెలుగును ఆయా ప్రాంతాలలోని భాషా సేవకులను, అభిమానులను గుర్తుచేసుకుంటూ ఉర్దూ భాషపై తనకు గల అభిమానాన్ని, పట్టును ప్రస్తావిస్తూ సాగించిన రచనే ఈ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠ్యభాగం.

3. వీర తెలంగాణ

        తెలంగాణ ప్రజలు పూరించిన ఉద్యమ శంఖారావం భూమండలం అంతా  ప్రతిధ్వనించాయి. అన్ని దిక్కులు మేల్కొల్పేటట్లు చేసాయి. దుర్మార్గుల చేతిలో చిక్కుకున్న తెలంగాణ గొప్పతనం విశేషాలకు ఇప్పుడు అడ్డులు తొలగిపోయాయి. తెలంగాణ తల్లి తన ఒడిలో కోటి మంది తెలుగు పిల్లల్ని పెంచి వారికి యుక్తవయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి నిజాం రాజు తో తలపడమని చెప్పింది. 
         తెలంగాణలో గడ్డి పోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. తానే గొప్ప రాజును అనుకునే నిజాం గర్వాన్ని అణచివేసేట్లుగా యుద్ధం సాగించింది. తెలంగాణలో ఏమి జరుగుతుందో తెలియక ప్రపంచమంతా భయపడిపోయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తులు కావడం కోసం తెలంగాణ ప్రజలు చేసిన స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగింది. తెలంగాణ పిల్లల్లో వచ్చిన విప్లవాత్మకమైన కదలిక భూమండలం అంతా ఆవరించింది. తెలంగాణ బిడ్డలంతా వీరులు, యోధులు, పరోపకారులు. 
      మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో తెలంగాణను ఆక్రమించి, ప్రజల గొంతులు కోస్తున్నప్పుడు తెలుగుదనాన్ని కోల్పోకుండా యుద్ధ రంగంలో దిగి విజయాన్ని సాధించారు. కాకతీయుల నుండి నేటిదాకా శత్రువుల దొంగదెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు. విజయం సాధిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నది.

4. కొత్తబాట
  
అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింప బడ్డాయి.

   'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు. అక్క పయనమై బండెక్కి బయలు దేరింది. వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు.  అక్క  ఎంత సేపటికీ  మాట్లాడపోయే  సరికి
ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.

  చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి  తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.

  కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది.  ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.

   గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ  పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే  గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.

   బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.
కొత్తబాట పాఠం ప్రకారం 
మారుతున్న సమాజంలో..
ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని. 
కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు. 
ముగింపు
  ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం. 

5. నగర గీతం

    అనేక వాహనాల శబ్దాలు, మనుషుల మాటలు, చిరువ్యాపారుల అరుపులతో నగరంలోని నాలుగు రోడ్ల కూడలిలో వినిపించే రణగొణ ధ్వనులు గుండెలదిరిపోయేలా మోగిస్తున్న ఢంకానాదంలా, ఉధృతమైన వేగంతో దూకే నయగారా జలపాతం హోరులా అనిపిస్తాయి. నిజానికి అరణ్యంలాంటి నగరం చేస్తున్న ధ్వనిలా, నగరజీవి బతుకుపోరాటంలోంచి వచ్చిన ఉఱుములాంటి శబ్దంలా ఉన్నాయని కవి వర్ణిస్తున్నాడు. 

   అమ్మ ఒడిలాంటి పుట్టిన ఊరును వదిలి ఉపాధికోసం నగరం తరలివచ్చిన వారికి ఇంత పెద్దపట్నంలో తలదాచుకోడానికి కాసింత స్థలం కూడా దొరకదు పేదరైతులు ఇనప్పెట్టెల్లాంటి ఇరుకిరుకు మురికి ప్రదేశంలో ఊపిరాడని స్థితిని అనుభవిస్తూ బతుకుతుంటారు.

   నగరంలో ప్రతిమనిషీ చదవవలసిన ఒక పుస్తకం లాంటివాడు. అయితే ఎవరూ అతని బతుకు పుస్తకంలోని పేజీలను చదివేవారే ఉండరు. నగరంలోని మనిషి వెనుక అనేక ఆసక్తికరమైన ఆనంద, విషాదగాథలుంటాయి. ఒక్కరైనా అతని బాగోగులు పట్టించుకునేవారే ఉండరనే చేదునిజాన్ని చెపుతున్నాడుకవి.

   నగరంలో ఉదయాన్నే విరబూసిన పువ్వుల్లాంటి స్కూల్ పిల్లలు సిటీ బస్సుల్లో, ఆటోల్లో, పేవ్మెంట్లపై సందడి చేస్తుంటరు. వారి మాటల్లోంచి చదువులసారం పుప్పొడిలా రాలుతుంది.

    నగరం నిండా అన్నివైపులా అందమైన ఎత్తైన భవనాలు ఉంయానుకోవద్దు. ఒకవైపు ఖరీదైన భవంతుల పక్కనే చిన్న చిన్న పూరిపాకలు ఉంటాయి. ఇక్కడ ఐశ్వర్యం, దారిద్ర్యం పక్కన్నేసమాంతర రేఖలుగా కనిపిస్తాయి. నగరం వైవిధ్యమైన సమస్యలతో విభిన్నమనస్తత్త్వాలతో కలసిపోయి కకలంతో నిండి ఉంటుంది. ఎంత నిరంతరాయంగా పనిచేసినా నగరంలోని మనిషికి విశ్రాంతి తీసుకోడానికి అనువైన సమయందొరకదు. సంపాదించిన ధనంతో కోరికను తీర్చుకునే తీరిక దొరకదు. కృత్రిమమైన వెలుగుల్లాంటి అసహజపు నవ్వులతో స్థిరత్వంలేని హడావుడి నడకలతో వెళ్ళేవాళ్ళు, ఆటోరిక్షాల్లో వెళ్ళేవాళ్ళు, ఆటోరిక్షాల్లో తిరిగే వాళ్ళు, వాళ్ళు ఆటోరిక్షాల్లో తిరిగే వాళ్ళు, కార్లలో ప్రయాణించే ధనవంతులు ఉంటారు.

    నగరంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అన్ని వైపులా ప్రమాదాలుపొంచి వుంటాయి. నాలుగు దిక్కుల్లోని రోడ్లలో మృత్యువు పొంచి వుంటుందని కవి హెచ్చరిస్తున్నాడు. 

  వృక్షాలమీద ఉండే పక్షులు పరస్పరం కలిసిపోయి కలివిడిగా ఉంటాయి. నగరమనే మహావృక్షంమీద నివసించే ఈ మనుషులు సాటిమనిషితో ఎటువంటి 
ఆత్మీయమైన పలకరింపులు లేకుండా ఇరుగూ పొరుగనే భావన కూడా లేకుండా ఎవరికి వారే ఏకాకిగా బతుకుతుంటారు. ఈ యాంత్రిక మానసిక స్థితిని నిరసిస్తున్నాడు కవి.

    ప్రయోగశాలలో ఏవేవో రాసాయన ద్రవాలు, ఆమ్లాలు వుంటాయి. వాటి చర్యలు అందరికీ అర్థం కావు. నగరం అంతకంటే అర్థం కాని రసాయనశాలలా ఉంటుంది. నగరంలో బతుకుదామని వచ్చినవాళ్ళు ఉపాది దొరకకపోయినా ఏదో ఒకరోజు దొరుకుతుందని ఆశగా వేచిచూస్తుంటారు. 

  ఇక్కడి సౌకర్యాలు, విలాసాలు, వినోదాలు పైపై మెరుగులు బలంగా ఆకర్షిస్తాయి. మరోవైపు నిరుద్యోగం, జీవనవ్యయం భయపెడుతున్నా నగరం విడిచి వెళ్ళబుద్ధిగాదు. కాలుష్యం కలవర పెట్టినా, ట్రాఫిక్ జామ్ లో జీవితం ఇరుక్కుపోయినా నగరం విడిచి ప్రశాంతంగా పల్లెలకు తిరిగిపోనియ్యని, చిక్కుముడి విడదీయలేని పద్మవ్యూహం లాంటిది నగరం.

6. భాగ్యోదయం

  కృష్ణస్వామి ముదిరాజ్ రచించిన రచించిన భాగ్యోదయంలో భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో చేసిన సామాజిక సేవ ను సంక్షిప్తంగా వివరించడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ 1888లో జన్మించాడు.

   ధర్మ శాస్త్రాలు చరిత్ర ను బాగా అధ్యయనం చేసి సమాజంలో ఉండే కుల వ్యవస్థ దాని నిజ స్వరూపాన్ని అవగతం చేసుకుని, అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకుని, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించాడు. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు చేపట్టాడు.

   ఏమీ ఆశించకుండా చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల తో పని చేశాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేసాడు. నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం వలన కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయ మయ్యాయి.

   సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొని ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో వివరించి చెప్పి తాగుడు మాన్పించాడు.
  ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిలభారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో అనేక సభలలో పాల్గొని 3,348 ఉపన్యాసాలు ఇచ్చి, అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేసాడు.
  
 1925 లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది-హిందూ యువతీ యువకులు సువర్ణ యువతీ యువకుల తో సమంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మాడు. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది.

   1931 జనాభా లెక్కలు సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆదిహిందువులు గా నమోదు చేయించాడు.

   భాగ్యరెడ్డి వర్మ చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. తనను జీవితాంతం సామాజిక సేవ వైపు నడిపించింది. అతన్ని ఉన్నత స్థాయిలో నిలిపింది.

ఉపవాచకం - రామాయణం

వాల్మీకి రామాయణం మూల భాష సంస్కృతం. రామాయణం ప్రపంచ సాహిత్యంలో మొదటి కావ్యం. వాల్మీకి ఆది కవి రామాయణానికి పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనే పేర్లున్నాయి. రామాయణంలో ఆరు కాండంలు కలవు. అవి బాల కాండం, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కిందకాండం, సుందరకాండం, యుద్ధకాండం. వాల్మీకి రామాయణంలో 24 వేల శ్లోకాలు కలవు. తెలుగులో మొదటి రామాయణం రంగనాథ రామాయణం. రచయిత గోనబుద్ధారెడ్డి. ఇది ద్విపద రచన. తెలుగులో ఇంకా భాస్కర,  మొల్ల, ఉషశ్రీ రామాయణాలు సుప్రసిద్ధం.
బాలకాండం: బ్రహ్మ ఆదేశానుసారం రామాయణం రచనకు శ్రీకారం చుట్టాడు. వాల్మీకి అయోధ్య నగరం వర్ణనతో శ్రీ రాముని జననం నుండి మొదలుకొని స్వయం వరం తర్వాత పరశురాముని గర్వభంగం - అయోధ్యకు చేరుకోవడం - భరత శత్రుఘ్నులు మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళడం.
అయోధ్యకాండం: దశరథుడు మిత్రుల మీద ప్రేమతో శ్రీ రాముని పట్టాభిషేకం చేయాలని నిర్ణయం - కైకేయి దశరథున్ని వరాలు కోరుకోవడం - రాముడు వనవాసం వెళ్లడం - భరతునికి పాదుకలు ఇవ్వడం - రాముడు సీత లక్ష్మణుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దండకారణ్యం లోకి ప్రవేశించడం.
అరణ్యకాండం: దండకారణ్య ప్రవేశం తర్వాత అందులో లో పర్ణశాల ఏర్పాటు - విరాధుని శాపవిమోచనం - సీతాపహరణం సుగ్రీవుని మైత్రి కొరకు ఋష్యమూక పర్వతాన్ని కి ప్రయాణం - దారిలో పంపా సరోవరాన్ని దర్శించడం.
కిష్కిందకాండం: రామలక్ష్మణులను చూసిన సుగ్రీవుడు భయంతో హనుమంతుని పంపడం - వీరికి మైత్రి కుదరడం - వాలిని వధించడం - సీత జాడ వెతుకుతూ వానర సైన్యం నలుదిక్కుల పయనం - హనుమంతున్ని జాంబవంతుడు ప్రేరేపించడం -  సముద్రలంఘనం కొరకు మహేంద్రగిరి చేరుకోవడం.
సుందరకాండం: హనుమ సముద్ర లంఘనం - లంకలో ఒక వనంలో సీతను చూడడం - సీతతో హనుమ మాట్లాడటం - హనుమంతుని తోకకు నిప్పు పెట్టడం - తిరిగి మహేంద్రగిరి పర్వతాన్ని చేరుకోవడం - శ్రీరాముని దగ్గరకు చేరుకొని సీత వృత్తాంతాన్ని చెప్పడం.
యుద్ధకాండం: శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించడం - వానర సైన్యం తో లంక కు ప్రయాణం - లంకలో రామ రావణ యుద్ధం - సీత వానర సైన్యం సమేతంగా అయోధ్యకు చేరుకోవడం - అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం.

సృజనాత్మకత

లేఖ: లిఖించడం అంటే రాయండం. లిఖించడం ద్వారా విషయాన్ని, అనుభూతుల్ని పంచుకోవడమే లేఖ. లేఖలో ఉండే ముఖ్యభాగాలు రెండు. అవి. 1. విషయం, 2. లేఖ భాగాలు, రెండూ సందర్భోచితంగా ఉండాలి. లేఖలోని మొత్తం భాగాలు రాసినా, విషయం లేకుంటే ప్రయోజనం లేదని గుర్తుంచుకోండి.
వ్యాసం: విషయాన్ని విస్తరించి లేదా వివరించి చెప్పడమే వ్యాసం. ఎంచుకున్న ఏ విషయాన్నైనా చదువరులకు అర్ధమయ్యేలా వివిధ ఉదాహరణలతో, జాతీయాలు పదబంధాలతో రాసే వ్యాసాలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. విషయాన్ని ఏదో ఒక అంశంతో ప్రారంభించాలి. ఇది రాబోయే వ్యాసంలోని విషయాన్ని పరిచయం చేయాలి. దీనినే 'ఉపోద్ఘాతం' అంటారు. ఉపోద్ఘాతంలో చెప్పిన విషయాలను వ్యాసంలో విస్తరించాలి. దీనినే విషయ విస్తరణ అంటారు. రాసే విషయాలన్నీ రాసి, దానిపై మన సొంత అభిప్రాయాన్ని జోడించాలి. అదే ముగింపు లేదా ఉపసంహారం. 
వ్యాస నిర్మాణ క్రమం: ఉపోద్ఘాతం, విషయ వివరణ, ముగింపులు 
చక్కగా ఉంటే వ్యాసం చక్కగా కుదిరినట్లు లెక్క
సంభాషణా రచన: సంభాషణ అంటే ఎదుటి వ్యక్తితో నోటి ద్వారా చేసే భావ వినిమయం. ఒకే వ్యక్తి మాట్లాడుతూ పోతే దీనిని ఉపన్యాసం అంటారు. ఇద్దరు వ్యక్తులు విషయాన్ని పంచుకుంటే సంభాషణ అంటారు. సన్నివేశాన్ని బట్టి సంభాషణ తీరుతెన్నులుంటాయి. అతిథులతో సంభాషించేటప్పుడు మర్యాదగా, పెద్దవారితో సంభాషించే టప్పుడు గౌరవంగా, ఆత్మీయులతో సంభాషించేటప్పుడు చనువుగా అధికారులతో మాట్లాడేటప్పుడు విషయ ప్రాధాన్యం ఉండేలా మాట్లాడాలి. విషయపరమైన సంభాషణ రాయమని అడిగితే, సంభాషణలో ఎక్కువ భాగం ఆ విషయాన్ని గురించే ఉండాలి. 
కనీసం రెండు పాత్రలలో సంభాషణ నిర్వహించాలి. అవసరమైతే పాత్రల సంఖ్య పెరగవచ్చు.ఒక్కో పాత్రకు కనీసం 5 సంభాషణ వాక్యాలతో, అంటే మొత్తం 10 వాక్యాలకు తగ్గకుండా సంభాషణ రాయాలి. నిడివి కొంచెం పెరిగినా ఫరవాలేదు.
ఇంటర్వ్యూ  ప్రశ్నావళి: నోటి మాటల ద్వారా ప్రశ్నలను అడుగుతూ సమాధానాల్ని రాబడితే అది ఇంటర్వ్యూ అలా కాకుండా లిఖిత పూర్వకంగా ప్రశ్నల్ని రాసి అడిగితే అది ప్రశ్నావళి. ఐతే పరీక్షల్లో, ఇంటర్వ్యూ ఐనా, ప్రశ్నావళి ఐనా రాయాల్సిందే! ఇంటర్వ్యూ  ప్రశ్నావళిని సిద్ధం చేసుకొనేటప్పుడు మనం ఏ విషయాన్ని రాబడుతున్నామో, ప్రధానంగా ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలే అడగాలి. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయమన్నప్పుడు కొన్ని ప్రశ్నలు వారి వ్యక్తిగత అంశాలపైన కూడా అడగవచ్చు. 10-15 ప్రశ్నలు రాస్తే సరిపోతుంది.
నినాదాలు, సూక్తులు: నినాదం: ఇది సూటిగా, గుర్తుండిపోయేలా ఉండాలి. పది వాక్యాలు చెప్పలేని అంశాన్ని ఒక నినాదం బలంగా చెప్పగలుగుతుంది. ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి, హృదయానికి హత్తుకునేలా చిరకాలం గుర్తుండేలా రూపొందేవి నినాదాలు. సమాజంలో వివిధ సందర్భాలలో నినాదాలను ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిని పరిశీలించండి. అలాగే, ప్రాస కలిసేటట్టుగా, భావం బలంగా వ్యక్తమయ్యేలా వివిధ అంశాలకు సంబంధించిన సూక్తులను సేకరించండి. సొంతంగా కొన్నింటిని రాసే ప్రయత్నం చేయండి. ...
గేయం/కవిత: గేయం, కవిత రెండూ ఒకటే. లయబద్ధంగా ఉంటే గేయం అంటాం. ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. కవితకు లయ అవసరం లేదు. కవితలను నిర్వచించడం కష్టం. ఐనా, చెప్పవలసిన విషయాన్ని హృదయానికి హత్తుకునేలా, చక్కగా, అందంగా, సరైన చోట సరైన పదాల్ని ప్రయోగిస్తూ చెప్పడాన్ని కవిత్వంగా చెప్పవచ్చు. కవితను రాయమన్నప్పుడు, వీలున్నన్ని వర్ణనలను, పోలికలను అంటే ఉపమాలంకారం, రూపకాలంకారం లాంటి అలంకారాలను, ప్రాసలను వాడే ప్రయత్నం చేయండి. దీని ద్వారా వ్యక్తీకరణకు ఒక అందం వస్తుంది. మీ స్థాయిలో ఈ ప్రయత్నం సరిపోతుంది.

పదజాలం

సొంతవాక్యాలు
1. కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) పలికి లేదనుట = నేను ఎప్పుడూ పలికి లేదని అనను.
ఆ) కుఱుచగుట = మా మామ కుఱుచగా ఉంటాడు.
ఇ) చేతులొగ్గు = ఎవరి దగ్గరా చేతులొగ్గి అడగను.

2. కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా: యాదిచేసుకొను = నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాదిచేసుకొని బాగా నవ్వుకున్నాం.
అ) పసందు = నా స్నేహితుని మాటలు పసందుగా ఉంటాయి.
ఆ) రమ్యం = పువ్వులు రమ్యంగా ఉంటాయి.
ఇ) క్షేత్రం = వేములవాడ క్షేత్రం చాలా గొప్పది.

3. కింది వాక్యాలు చదువండి. గీతగీసిన పదాల అర్థాలనుపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) గాలికి ఊగుతున్న పువ్వులు చిగురుటాకులతో సయ్యాటలాడుతున్నాయి.
సయ్యాటలాడు=పరిహాసాలాడు - తాతా మనుమలు పరిహాసాలాడుకుంటారు
ఆ) స్వాతంత్ర్యోద్యమం బ్రిటిష్ వారి గుండెల్లో కల్లోలం రేపింది.
కల్లోలం=ఆందోళన - రైతుల పోరాటం ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది.
ఇ) వీరులెప్పుడూ ప్రాణాలను అర్పించడానికి వెనుకాడరు.
వెనుకాడరు=వెనుకంజ వేయరు - తెలంగాణ ఉద్యమంలో యువకులు ఎప్పుడూ వెనుకంజ వేయలేదు.
ఈ) దిక్కు తోచనప్పుడు అయోమయంలో పడుతాం.
దిక్కుతోచనప్పుడు=దారి తోచనప్పుడు - దారి తోచనప్పుడు ప్రశాంతంగా ఆలోచించాలి.

4. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించండి.
అ) ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి.
మా తాత చెప్పే కథలను చెవివారిచ్చి వింటాను.
ఆ) చిరుతపులులు గవిన్లలో నివసిస్తాయి.
సింహం ఆహారంకోసం గవిన్ల నుండి బయటికి వస్తుంది.
ఇ) కుటిలవాజితనం పనికిరాదు.
కొందరు కుటిలవాజితనంతో ఇతరులను బాధపెడుతారు.
ఈ) మా ఊరి పొలిమేర లో పంటపొలాలున్నాయి.
మా ఊరి పొలిమేరలో పచ్చని చెట్లు ఉంటాయి.

5. కింది పదాలను ఉపయోగిస్తూ సొంతవాక్యాలు రాయండి.
అ) ఏకతాటిపై = ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఏకతాటిపై ఉండాలి.
ఆ) మచ్చుతునక = తెలంగాణ వైభవానికి రామప్ప ఆలయం మచ్చుతునక.
ఇ) మహమ్మారి = నేటికీ వరకట్న మహమ్మారికి ఎందరో బలవుతున్నారు.
ఈ) నిరంతరం = విద్యార్థులు నిరంతరం చదువులపై దృష్టిపెట్టాలి.

6. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) భాసిల్లు = మన తెలంగాణ సకలసంపదలతోభాసిల్లాలని కోరుకుందాం.
ఆ) ఉద్బోధించు = అంబేద్కర్ కులమత భేదాలను రూపుమాపాలని ఉద్భోదించాడు.
ఇ) దైన్యస్థితి = ప్రజల దైన్యస్థితి ని తొలగించడానికి ప్రయత్నించేవారే నాయకులు.
ఈ) నరరూపరాక్షసుడు = ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవాడు నరరూపరాక్షసుడు.

7. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
అ) ముసురుకొను = కష్టాలు ముసురుకున్నా ధైర్యం విడిచిపెట్టకూడదు.
ఆ) ప్రాణంపోయు = ప్రాణంపోసే వైద్యుడు ఎంతో గొప్పవాడు.
ఇ) గొంతు వినిపించు = నీ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించక పోయినా నీ గొంతు వినిపించడం మానకు.
ఈ) యజ్ఞం = ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ఒక మహాయజ్ఞం

8. కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
అ) వ్యాప్తి = సువాసనలు ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందాయి.
ఆ) జంకని అడుగులు = జంకని అడుగులు వేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాము.
ఇ) ఎడారి దిబ్బలు = ఒంటెలు ఎడారి దిబ్బలు దాటుకుంటూ వేగంగా నడుస్తాయి.
ఈ) చెరగని త్యాగం = చెరగని త్యాగం వల్లనే గొప్పపేరు వస్తుంది.

9. కింది వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించండి.
అ) పుట్టినిల్లు = వరంగల్లు కాకతీయుల వైభవానికి పుట్టినిల్లు.
ఆ) పాటుపడడం = ప్రతి వ్యక్తీ సమాజ అభివృధ్ధికోసం పాటుపడాలి.
ఇ) పీడవదలడం = దేశం బాగుపడాలంటే అవినీతి పీడవదలడం చాలా ముఖ్యం.
ఈ) తలదాచుకోవడం = ఎండా వాన చలి నుండి తలదాచుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు వుండాలి.

జాతీయాల వివరణ

1. కింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలపండి.

నక్షత్రకుడు

వెంబడిపడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతారు.

నిండుకొన్నవి

‘అయిపోయినవి’ అనే అర్థంలో వాడతారు. ఖాళీ అవడం

దడిగట్టు

'రక్షణ కల్పించు' అనే అర్థంలో వాడతారు.

నిప్పుకలు సెరుగంగ

‘మిక్కిలి కోపాన్ని ప్రదర్శించటం' అనే అర్థంలో వాడతారు.


2. కింది పదాలను / పదబంధాలను వివరించి రాయండి.
అ) అంకితం కావడం = చేయదలచుకొన్న పనియందు తప్ప, వేరే ఆలోచన, పని లేకపోవడం.
ఆ) నైతిక మద్దతు = ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించడం.
ఇ) చిత్తశుద్ధి = మనస్సులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించడం.
ఈ) సాంఘిక దురాచారాలు = సంఘపరమైన చెడు ఆచారాలు
ఉ) సొంతకాళ్ళపై నిలబడడం = ఎవరిపైనా, దేనికీ ఆధారపడకుండా తనను తాను పోషించుకోవడం.

3. కింది పదాలను వివరించి రాయండి.
అ) పటాటోపము = అంటే, డాబు, దర్పము అని అర్ధము. (పట + ఆటోపము) అని దాన్ని విడదీస్తే వస్త్రముల యొక్క ఆడంబరము అని అర్ధము వస్తుంది. తమ గొప్పతనాన్ని, గర్వాన్ని, డాబును వస్త్రముల ధారణ ద్వారా ప్రదర్శించడం అని దాని భావము.
ఆ) అగ్రహారం = బ్రాహ్మణులు నివసించడానికి కట్టబడిన గ్రామమును అగ్రహారం అంటారు. బ్రాహ్మణుల కోసం పన్నులు మొదలైనవి కట్టనక్కరలేకుండా, రాజులచే దానం ఇవ్వబడిన భూమిని కూడా అగ్రహారం అంటారు.
ఇ) బంజాదర్వాజా = బంజారాలు అని పిలువబడే లంబాడీలు, ధాన్యం, ఉప్పు మొదలయిన వాటిని, గోలకొండ కోటలోకి తెచ్చే ప్రవేశ ద్వారాన్ని బంజారా దర్వాజా అని పిలుస్తారు.
ఈ) ధర్మశాల = ధర్మము కొరకు అన్నము మొదలైనవి దానం చేయడానికి కట్టిన ఇల్లు. దీనినే సత్రము అంటారు. దీనిలో యాత్రికులు ఉచితంగా నివసిస్తారు.

4. కింది పదాలను వివరించి రాయండి.
అ) హృదయసంస్కారం = మంచిచెడ్డలను విచక్షణతో గుర్తించి, మంచిని ప్రోత్సహించి, చెడును ఖండించి, దీనుల యందు కరుణను చూపించే సుగుణం, మనశ్శుద్ధి, బుద్ధి పరిపక్వత, హృదయ నిర్మలత అనే సుగుణాలను కల్గియుండడం, మంచి చెడ్డలను స్పందించే హృదయం కల్గియుండటం.
ఆ) సామాజిక పరిణామం = సంఘంలో వచ్చే మార్పు. కాలానుగుణంగా వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అలా సంభవించే మార్పును "సామాజిక పరిణామం" అంటారు.
ఇ) భారతీయ సంస్కృతి = భారతదేశం అనాదిగా వేదధర్మాన్ని అనుసరిస్తోంది. ఈ దేశంలో పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు పుట్టాయి. ఆయా ధర్మశాస్త్రాలకు అనుగుణంగా మన భారతీయ నాగరికత వర్ధిల్లింది. అదే మన 'భారతీయ సంస్కృతి'
ఈ) అతలాకుతలం = 'అతలము' అంటే భూమికి క్రింది లోకం. 'కుతలం' అంటే భూమి, అతలాకుతలం అంటే విపరీతంగా శ్రమపడటం అని అర్ధం. కింది లోకం, పైలోకం అల్లకల్లోలమైనంత శ్రమ అని అర్ధం.

అర్థాలు
1. కింది పదాలకు అర్థాలు రాయండి.
అ) నగారా = పెద్ద ఢంకా (భేరి)
ఆ) ఘోష = ఉరుము, పెద్ద శబ్దం
ఇ) సందడి = జన సమూహం 
ఈ) పఠనీయ గ్రంథం = చదువదగిన పుస్తకం

2. కింది పదాలకు అర్థాలను రాయండి.
అ) ద్వాఃకవాటము = ద్వారము తలుపు
ఆ) వీక్షించు = చూచు
ఇ) అంగన = స్త్రీ
ఈ) మచ్చెకంటి = చేపల వంటి కన్నులు కలది (స్త్రీ)
ఉ) భుక్తిశాల = భోజనశాల

3. గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది.
ధ్యాస = దృష్టి
ఆ) ప్రజ్ఞ, మనోజ్ఞ ఇద్దరూ సఖ్యత తో మెలుగుతారు.
సఖ్యత = స్నేహము
ఇ) ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది.
హస్తవాసి = చేతి చలువ
ఈ) తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది.
ప్రఖ్యాతి = ప్రసిద్ధి
ఉ) పూర్వం జమీందారుల దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి.
దేవిడీ = పెద్ద భవంతి

పర్యాయ పదాలు

1. కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి. 
అ) జలములతో నిండిన చెఱువులు మిక్కిలి హాయినీ, ఆనందాన్నీ కలిగిస్తాయి.
జలము = నీరు, ఉదకము, సలిలము, తోయము, 
ఆ) జీవచ్ఛవం కావటంకన్నా యశఃకాయుడు కావడం మిన్న.
యశము(యశస్సు) = కీర్తి, ఖ్యాతి, పేరు

2. కింది పర్యాయపదాలకు పాఠం ఆధారంగా సరియైన పదాన్ని రాయండి.
అ) ఇల్లు, గృహం = సదనం, గేహం
ఆ) పొగడ్త, స్తోత్రం = ప్రశంస

3. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) మురళీరవము మానసిక ఆహ్లాదాన్నిస్తుంది. 
రవము = ధ్వని, రొద, చప్పుడు, శబ్దము
ఆ) రుద్రమదేవి కృపాణముతో శత్రువులను చెండాడింది.
కృపాణము = ఖడ్గం, కత్తి, అసి, కరవాలం
ఇ) జలధి అనేక జీవరాశులకు నిలయం.
జలధి = సముద్రం, సాగరం, పయోధి, లబ్ధి, కడలి
ఈ) జాతీయ జెండాను గౌరవించాలి.
జెండా = పతాకం, దాఢ
ఉ) హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.
లంఘించు = దాటు, దుముకు, తరించు

4. కింది వాక్యాల్లో పర్యాయపదాల కింద గీత గీయండి.
అ) రోజూ పెయి కడుక్కోవాలి. లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి. (పెయి=మేను,దేహం)
ఆ) మనుషులు నీళ్ళు దొరికే తావుల్ల నివసిస్తారు. సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. (తావు = చోటు, ప్రదేశం)

5. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) నరుడు = మానవుడు, మనిషి
ఆ) అరణ్యం = అడవి, విపినం
ఇ) రైతు = కర్షకుడు, కృషీవలుడు
ఈ) పువ్వు = కుసుమం, పుష్పం
ఉ) మరణం = చావు, మృత్యువు
ఊ) వాంఛ = కోరిక, అభిలాష
ఎ) వృక్షం = చెట్టు, తరువు
ఏ) పల్లె = గ్రామం, జనపదం

6. కింది పదాలకు పర్యాయ పదాలను రాయండి.
అ) అండ = ఆధారం, ఆదరువు, ఆలంబనం, ఆసరా, ఆశ్రయం
ఆ) ఉన్నతి = గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి
ఇ) స్వేచ్ఛ = స్వచ్ఛందము, అలవోక, స్వతంత్రత, స్వాతంత్య్రం
ఈ) వికాసం = వికసనం, ప్రఫల్లం, వికసించడం

7. కింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించండి. రాయండి.
అ) అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపుకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది. (ఏనుగు = గజము, కరి)
ఆ) స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. ఆ నెచ్చెలులే మనకు నిజమైన సంపద. (స్నేహితులు = మిత్రులు, నెచ్చెలులు)
ఇ) రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తిసాములో నైపుణ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అసితోనే రాజులు శత్రువులపై విజయం సాధిస్తారు.(కృపాణం = కత్తి, అసి)
ఈ) బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఆ స్వర్ణంతో స్వర్ణకారుల దగ్గరకు వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు. (బంగారం = కనకం, స్వర్ణం, పసిడి)

8. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
ఉదా: తారలు = చుక్కలు, నక్షత్రాలు
అ) జ్ఞాపకం = జ్ఞప్తి, గుర్తు
ఆ) పోరాటం = యుద్ధం, రణం
ఇ) విషాదం = దుఃఖము, వ్యధ
ఈ) సంస్కరణ = సంస్కారము, సత్కర్మము

9. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) మబ్బు = మేఘము, మొయిలు, అంబుదము, ఘనము
ఆ) గుండె = హృదయము, హృత్తు, డెందము
ఇ) శిరసు = తల, శీర్షము, మస్తకము, మూర్ధము

10. కింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె. 
వనిత = స్త్రీ, నారి, అంగన, పడతి, పురంధ్రి
ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము. 
పసిడి = బంగారము, సువర్ణము, కనకము, హిరణ్యము, పైడి
ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁదలంచెను. 
పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు, కృష్ణ ద్వైపాయనుడు
ఈ) ఇవ్వటిమీద నాగ్రహము తగునె?
ఆగ్రహము = కోపము, క్రోధము, రోషము, కినుక
ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
అహిమకరుడు = సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు

నానార్థాలు

1. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) కులము = వంశము, శరీరము, దేశము, జాతి, ఇల్లు
ఆ) క్షేత్రము = పుణ్యస్థలము, శరీరము, భార్య, భూమి, వరిమడి
ఇ) హరి = విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహము, పాము
ఈ) చిత్రము = ఆశ్చర్యం, బొమ్మ (చిత్తరువు), అద్భుత రసం

2. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) కవి = కావ్యము రాసినవాడు, శుక్రుడు, నీటికాకి
ఆ) క్షేత్రం = పుణ్యస్థలము, శరీరము, భార్య

3. కింది పదాలకు నానార్థాలు రాయండి.
అ) ఉదయము = ఉదయించడం, తూర్పుకొండ, పుట్టుక, సృష్టి
ఆ) ఆశ = కోరిక, దిక్కు
ఇ) అభ్రము = మబ్బు, ఆకాశం, బంగారము, కర్పూరం, స్వర్గము

4. కింది వాక్యాల్లో నానార్థాలు వచ్చే పదాలను గుర్తించండి.
అ) వీడు ఏ వీడువాడోగాని దుష్కార్యములను వీడుచున్నాడు.
వీడు = ఇతడు, పట్టణము, వదలుట
ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు.
రాజు = క్షత్రియుడు, చంద్రుడు, ప్రభువు

ప్రకృతి వికృతులు

1. కిందివాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.
అ) సిరి - శ్రీ
ఆ) విష్ణువు - వెన్నుడు
ఇ) ధర్మము - దమ్మము
ఈ) బ్రహ్మ - బమ్మ, బొమ్మ

2. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి, వికృతులను రాయండి.
అ) మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. (భాష - బాస)
ఆ) నాది ప్రజా కవిత కద! (కవిత - కైత)
ఇ) మా అమ్మమ్మ రోజూ కత చెప్పుతుంది. (కత - కథ) 
ఈ) కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. (ఇంతి - స్త్రీ)

3. కింది పట్టిక నుండి ప్రకృతి, వికృతులను వేరుచేసి రాయండి.

సముద్రం

అదెరువు

శిఖ

విద్య

పైనం

విద్దె

ప్రయాణం

సంద్రం

సిగ

ఆధారం

సముద్రం - సంద్రం
అదెరువు - ఆధారం
శిఖ - సిగ
విద్య - విద్దె
పైనం - ప్రయాణం

4. కింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి. వేరు చేసి రాయండి.
అ) తూరుపు దెస ఎర్రబడింది. దక్షిణ దిశవైపున్న నేను ఒక్కసారిగా అటు తిరిగాను. (దెస - దిశ)
ఆ) సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రం భయాన్ని కలిగిస్తుంది. (సముద్రం - సంద్రం)
ఇ) రాయడు తలుచుకుంటే అన్నీ సాధ్యం. రాజు మనసును పసిగట్టడం కష్టం. (రాయుడు - రాజు)

5. కింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.
అ) విద్య                                                                                         (ట)     
క) విదియ       చ) విజ్ఞ             ట) విద్దె          త) విద్య
ఆ) భిక్ష                                                                                          (త)
క) బత్తెము       చ) బచ్చ            ట) బిచ్చ         త) బిచ్చము  
ఇ) యాత్ర                                                                                      (చ)
క) యతర        చ) జాతర         ట) జైత్ర          త) యతనము
ఈ) మత్స్యము                                                                                 (ట)
క) మచ్ఛీ         చ) మత్తియము    ట) మచ్చెము    త) మత్తము
ఉ) రత్నము                                                                                    (క)
క) రతనము     చ) రచ్చ             ట) రచ్చము    త) రత్తము
ఉ) పంక్తి                                                                                       (ట)
క) పంతులు     చ) పత్తి              ట) బంతి       త) పంకు

వ్యుత్పత్త్యర్థాలు

1. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి.

అ) నీరజభవుడు = నీటి నుండి పుట్టిన, తామరపద్మము నుండి పుట్టినవాడు (బ్రహ్మ).
ఆ) త్రివిక్రముడు = మూడు అడుగులచే మూడులోకాలనూ కప్పినవాడు (విష్ణుమూర్తి).

2. కింది వ్యుత్పత్తులకు పదాలను రాయండి.

అ) అజ్ఞానమనెడు అంధకారాన్ని తొలగించువాడు = గురువు
ఆ) భాషింపబడునది = భాష

వ్యాకరణం

సంధులు
సంధి: ముందరి పదము యొక్క చివరి అక్షరము, తరువాత పదము యొక్క మొదటి అక్షరము ఒకదానితో నొకటి కూడుకొనుట.

“సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక”.
“తెలుగులోసంధి అనగా రెండు పదముల కలయిక”.
సవర్ణదీర్ఘ సంధి: “అ, ఇ, ఉ, ఋ లకు అవే అచ్చులు (సవర్ణములు) పరమైనప్పుడు వాని దీర్ఘం ఎకాదేశామవుతుంది”. సవర్ణాలు: ఒకేరకమైన అచ్చులను సవర్ణాలు అంటారు. అ, ఇ, ఉ, ఋ లు సవర్ణములు. ఏకాదేశం: ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు.
విద్య+ఆలయము = విద్యాలయము 
సచివాలయం = సచివ+ఆలయం (అ+ఆ=ఆ)

దిశాంచలము = దిశ+అంచలములు (అ+అ=ఆ)
శ్రావణాభ్రము = శ్రావణ+అభ్రము (అ+అ=ఆ)
దేవాలయాలు=దేవ+ఆలయాలు (అ+ఆ=ఆ)
అశ్వారూఢుడు=అశ్వ+ఆరూఢుడు (అ+ఆ=ఆ)
రాజాజ్ఞ=రాజ+ఆజ్ఞ (అ+ఆ=ఆ)
పుణ్యాంగన=పుణ్య+అంగన (అ+అ=ఆ)
మునీశ్వర = ముని+ఈశ్వర (ఇ+ఈ=ఈ) 
గుణసంధి: “ ‘అ’ కారానికి  ఇ, ఉ, ఋ లు పరమైతే వరసగా ఏ, ఓ, అర్ లు ఏకాదేశామవుతాయి.” ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు. కావున ఇది గుణ సంధి.(అకారము అంటే అ లేదా ఆ)
నవ+ఉదయం=నవోదయం (అ+ఉ=ఓ)
దేవ+ఋషి=దేవర్షి (అ+ఋ=అర్)
గర్వోన్నతి = గర్వ+ఉన్నతి (అ+ఉ=ఓ)
వదాన్యోత్తముడు = వదాన్య+ఉత్తముడు (అ+ఉ=ఓ) 
రామ్యోద్యానములు = రమ్య+ఉద్యానములు (అ+ఉ=ఓ)
యణాదేశ సంధి: “ఇ, ఉ, ఋ లకు అసవర్ణాచ్చులు పరమైతే వరసగా య, వ, ర లు ఆదేశమవుతాయి.” ఇ, ఉ, ఋ లను ఇక్కులని, య, వ, ర లను యణ్ణులు అంటారు. యన్ణులు ఆదేశంగా వస్తాయి. కావున ఇది యణాదేశ సంధి.
అత్యంతము = అతి+అంతము (ఇ+అ=య)  
అత్యద్భుతం = అతి + అద్భుతం (ఇ+అ=య)
అభ్యాగతులు = అభి+ఆగతులు (ఇ+ఆ=య) 
అణ్వాయుధాలు = అణు+ఆయుధాలు(ఉ+ఆ=వ) 
వృద్ధి సంధి: ‘అ’ కారానికి - ఏ, ఐ లు పరమైతే ‘ఐ’ - ఓ, ఔలు పరమైతే ‘ఔ ’- ఋ, ౠలు పరమైతే ‘ఆర్’లు ఏకాదేశమవుతాయి”. ఐ, ఔ, ఆర్ లను వృద్ధులు అంటారు. వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కనుక వృద్ధి సంధి.
రసైక = రస + ఏక (అ + ఏ = ఐ)
ఏకైక = ఏక+ఏక(అ + ఏ = ఐ)
వసుధైక = వసుధ+ఏక (అ + ఏ = ఐ)
దివ్యైరావతం = దివ్య + ఐరావతం (అ + ఐ = ఐ)
దేశైశ్వర్యం = దేశ+ఐశ్వర్యం (అ + ఐ = ఐ)
అష్టైశ్వర్యాలు = అష్ట+ఐశ్వర్యాలు (అ + ఐ = ఐ)
ఘనౌషధి = ఘన + ఓషధి (అ + ఓ = ఔ)
వనౌషధి = వన+ఔషధి (అ + ఓ = ఔ)
మహౌషధి = మహా+ఔషధి (అ + ఓ = ఔ)
 రసౌచిత్యం = రస + ఔచిత్యం (అ + ఔ = ఔ)
 దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
 నాటకౌచిత్యం = నాటక+ఔచిత్యం (అ + ఔ = ఔ)
 దివ్యౌషధం = దివ్య+ఔషధం (అ + ఔ = ఔ)
 సమైక్యత = సమ+ఐక్యత (అ + ఐ = ఐ)  
ఉత్త్వ/ఉకార సంధి:
సూత్రం: “ఉత్తునకు సంధి నిత్యం”. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది.
ఉత్తు: హ్రస్వమైన ఉ. నిత్యం: ఎల్లప్పుడూ తప్పక జరుగును
మనము+ఉంటిమి=మనముంటిమి.
జగమెల్ల = జగము+ఎల్ల
సయ్యాటలాడెన్ = సయ్యాటలు+ఆడెన్
ధరాతలమెల్ల = ధరాతలము+ఎల్ల
ప్రపంచమంతా = ప్రపంచము+అంతా
నీరవుతుంది = నీరు + అవుతుంది
ఎత్తులకెదిగిన = ఎత్తులకు + ఎదిగిన
పేరవుతుంది = పేరు + అవుతుంది 
ఇత్త్వ/ఇకార సంధి: “ఇత్తునకు సంధి వైకల్పికముగానగు”. ఏమ్యాదులందు ఇత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.
ఇత్తు: హ్రస్వమైన ఇ. వైకల్పికము: ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరగక (నిషేధము) పోవడాన్ని 
వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ వైకల్పికము అంటారు.
వచ్చితిమి+ఇప్పుడు = వచ్చితిమిప్పుడు .
దారినిచ్చిరి = దారిని+ఇచ్చిరి
అత్త్వ/అకార సంధి: “అత్తునకు సంధి బహుళముగానగు”. అత్తు నకు అచ్చు పరమైనపుడు సంధి బహుళము. అత్తు: హ్రస్వమైన అ. బహుళము: సంధి నిత్యంగా, వైకల్పికంగా, నిషేధంగా, అన్యకార్యంగా జరుగడాన్ని బహుళం అంటారు. (అన్య అనగా ఇతర, కార్యము అనగా పని, హేతువు)
మేన+అల్లుడు=మేనల్లుడు. 
మేనత్త = మేన+అత్త
సరళాదేశ సంధి/ద్రుత ప్రకృతిక సంధి: “ద్రుత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే పరుషాలు  సరళాలుగా మారును”.
కచటతపలు వరుసగా గజడదబలు గా మారుతాయి.
ద్రుతము: నకారాన్ని ద్రుతం అంటారు. (ను, న్)
దృతప్రకృతికాలు: నకారం చివరన వుండే పదాలను దృతప్రకృతికాలు అంటారు. (పదం చివరన ను లేదా న్ వుండడం)
పరుషాలు: కచటతప సరళాలు: గజడదబ
పూచెను+కలువలు=పూచెనుగలువలు
మూటఁగట్టు = మూటన్+కట్టు 
పూచెనుగలువలు = పూచెను+కలువలు 
గసడదవాదేశ సంధి: ప్రథమ మీది పరుషాలకు గసడదవలు బహుళముగానగు. (ప్రథమ  అనగా ప్రథమా విభక్తిప్రత్యాలు)
కచటతప లకు వరసగా గసడదవలు ఆదేశంగా వస్తాయి
వాడు+కొట్టె=వాడుగొట్టె
నాల్కలుసాచు = నాల్కలు+చాచు
ప్రాణాలు గోల్పోవు = ప్రాణాలు+కోల్పోవు 
ఆసువోయుట = ఆసు+పోయుట
కాలుసేతులు = కాలు+చేతులు
త్రిక సంధి: “ఆ ఈ ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.
ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘంనకు హ్రస్వంబగు”.
ద్విరుక్తం: ద్విరుక్తము అనగా ద్విత్వాక్షరం
ఆచ్చికం: అచ్చ తెలుగు పదం
అచ్చోట = ఆ+చోట - త్రికసంధి
ఎక్కాలం=ఏ+కాలం - త్రికసంధి
ఇవ్వీటి = ఈ+వీటి- త్రికసంధి
రుగాగమ సంధి: “పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు”.
కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.
కర్మదారయము: విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు.
ఒక వర్ణం మిత్రుడిలా అదనంగా చేరడమే ఆగమం.
పేదాది శబ్దములు:  పేద, బీద, బాలింత మొదలైన పదాలు పేదాదులు.
పేదరాలు = పేద + ఆలు
బీదరాలు = బీద + ఆలు
బాలింతరాలు = బాలింత + ఆలు
గుణవంతురాలు = గుణవంత + ఆలు
శ్రీమంతురాలు = శ్రీమంత + ఆలు
బుద్ధిమంతురాలు = బుద్ధిమంత + ఆలు
సాహసవంతురాలు = సాహసవంత+ఆలు

సమాసాలు
సమాసము: రెండుమూడు శబ్దములను ఏకపదముగా చేర్చడము. విభక్తి లోపము చేసిన పదము.
“సమర్థములగు పదముల యేకీభావము”, సమాసములు వేరు వేరు అర్థములు గల పదములు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదమూ ఉత్తరపదమనియు అంటారు.
వేరువేరు అర్థాలుగల రెండు పదాలు ఒకే పదం అగుటద్వారా సమాసం ఏర్పడుతుంది.
విగ్రహవాక్యం: సమాసానికి అర్థ వివరణాన్నే విగ్రహవాక్యం అంటారు.
ద్వంద్వ సమాసము: “ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము”. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును. రెండుకాని అంతకన్న ఎక్కువగాని సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు.
రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
ఆలుమగలు - ఆలును, మగడును
తల్లిదండ్రులు - తల్లియును, తండ్రియును
జీవధనములు - జీవమును, ధనమును 
భూతప్రేతములు - భూతమును, ప్రేతమును 
శక్తియుక్తులు - శక్తియును, యుక్తియును
అందచందములు - అందమును, చందమును
ద్విగు సమాసము: “సంఖ్యాప్రధానం ద్విగువు”.  సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును. 
ఇందు సంఖ్యా వాచక విశేషణమే పూర్వమందుండును.
పూర్వ పదం సంఖ్యా వాచకమైతే అది ద్విగువు. పూర్వపదం సంఖ్య అయితే తర్వాత పదం ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది.
మూడు లోకములు - మూడు అయిన లోకములు.
త్రికరణాలు - త్రి (మూడు) సంఖ్యగల కరణాలు
నవరసాలు - నవ (తొమ్మిది) సంఖ్యగల రసాలు`
మూడడుగులు - మూడు సంఖ్య గల అడుగులు 
దశదిక్కులు - దశ సంఖ్య గల దిక్కులు
రూపక సమాసం: రూపక సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అనికూడా అంటారు. అవధారణ: నిశ్చయించుట, నిశ్చయము, హద్దులో వుంచుట, ప్రతిబంధకము.
సమాసము లోని రెండు పదములలో రెండవ పదము ఉపమానముగానుండును. “ఉపమానము యొక్క ధర్మాన్ని  ఉపమేయముపై ఆరోపించడాన్ని రూపక సమాసం లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు”.
“ఉపమాన ఉపమేయములకు అభేదం తెలపడం రూపకం.”
అభేదం: భేదమున్నను భేదమున్ననూ భేదం లేనట్లు చెప్పడం. “ఉపమాన ఉపమేయములకు భేదమున్ననూ భేదం లేనట్లు చెప్పడం రూపకం”.
విద్యా ధనము - విద్య అనెడి ధనము
కాంతివార్ధులు = కాంతులు అనే వార్ధులు 
మతపిశాచి = మతము అనే పిశాచి 
బహువ్రీహి సమాసము:
“అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి”. అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది. ఇందు సమాసము లోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు.
అన్యము: ఇతరము, వేరొక. సమాసములోని పదాల ద్వారా వచ్చే మరో పదము యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్నట్టయితే దానిని బహువ్రీహి సమాసం అంటారు.
చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు
చంద్రుడు - చల్లనైన కిరణములు కలిగినవాడు 
చతుర్ముఖుడు - నాలుగు ముఖములు కలవాడు 
నీలవేణి - నీలమైన వేణి గలది 
గరళకంఠుడు - గరళము కంఠమున గలవాడు
దయాంతరంగుడు - దయతో కూడిన అంతరంగము కలవాడు
ఆజానుబాహుడు ౼ జానువుల వరకు బాహువులు కలవాడు.
ముక్కంటి ౼ మూడు కన్నులు కలవాడు.
గరుడ వాహనుడు ౼ గరుడుడు వాహనముగా కలవాడు.
చతుర్ముఖుడు ౼ నాలుగు ముఖాలు కలవాడు.
పద్మాక్షి - పద్మం వంటి కన్నులు కలది.
దశకంఠుడు = దశ సంఖ్య గల కంఠములు గలవాడు 
పీతాంబరుడు = పసుపు పచ్చిని అంబరము కలవాడు 
అరవిందానన = అరవిందము వంటి ఆననము కలది 
మృగనేత్ర =  మృగము వంటి నేత్రములు కలది చంచలాక్షి 
మానధనులు = అభిమానమే ధనముగా గలవారు 
రాజవదన = రాజు అనగా చంద్రుని వంటి వదనము గలది 
నీరజభవుడు = నీరాజము అనగా పద్మము పుట్టుకగా గలవాడు
చక్రపాణి = చక్రము పాణి యందు గలవాడు.
తత్పురుష సమాసాలు:
“ఉత్తర పదార్థ ప్రధానం తత్పురుషం”. సమాసంలోని రెండో పదం యొక్క అర్థం ప్రధానంగా గల సమాసం తత్పురుషం. తత్పురుష సమాసాలను వ్యవధికరణ సమాసాలంటారు.
వ్యవధికరణం: విభక్తులతో కూడిన పదాలకు మీదిపదం పదంతోడి సమాసాన్ని వ్యవధికరణం అంటారు. విగ్రహవాక్యంలో విభక్తి ప్రత్యయాలను చేర్చవలసి వస్తే మొదటి పదం చివర ఏ విభక్తి అనుకూలిస్తుందో ఆ విభక్తి పేరుతో ఈ సమాసాన్ని పిలుస్తారు. పూర్వపదం చివరవుండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తిస్తారు.
విభక్తులు
విభక్తులను కారకాలని కూడా అంటారు. అంటే క్రియతో అన్వయం పొందేవి లేదా అన్వయం కలిగించేవి అని అర్థం. తెలుగులోని విభక్తులన్నింటికీ క్రియతో సంబంధం ఉంటుంది. ఇవి పొడి అక్షరాల రూపంలోను, పదాల రూపంలోనూ ఉంటాయి. వీటికి చాలా వరకు ప్రత్యేకంగా అర్థముండదు. వీనిని నామ విభక్తులని కూడా అంటారు. ప్రత్యయాలని మరోపేరు.

ప్రత్యాలు

విభక్తులు

డు, ము, వులు

ప్రథమా విభక్తి

నిన్, నున్, లన్, గూర్చి, గురించి

ద్వితీయా విభక్తి

చేతన్, చేన్, తోడన్, తోన్

తృతీయా విభక్తి

కొఱకున్ (కొరకు), కై

చతుర్ధీ విభక్తి

వలనన్, కంటెన్, పట్టి

పంచమీ విభక్తి

కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్

షష్ఠీ విభక్తి

అందున్, నన్

సప్తమీ విభక్తి

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ

సంబోధనా ప్రథమా విభక్తి


ప్రథమా తత్పురుష సమాసం
అర్ధరాత్రి - రాత్రి యొక్క అర్ధభాగము 
మధ్యాహ్నం - అహ్నం మధ్యభాగం 
ద్వితీయా తత్పురుష సమాసం
నెలతాల్పు - నెలను తాల్చినవాడు
జలధరము - జలమును ధరించునది
తృతీయా తత్పురుష సమాసం
వయోవృద్ధులు - వయస్సు చేత వృద్ధులు 
కనకాభిషేకము - కనకముతో అభిషేకము 
చతుర్థీ తత్పురుష సమాసం
ఊతపదాలు - ఊతం కొరకు పదాలు 
బ్రతుకు త్రోవ - బ్రతుకు కొరకు త్రోవ 
సంక్షేమపథకాలు - సంక్షేమము కొరకు పథకాలు 
పంచమీ తత్పురుష సమాసం
దొంగభయము - దొంగ వలన భయము
స్వర్గపతితుడు - స్వర్గము నుండి పతితుడు
షష్ఠీ తత్పురుష సమాసము
కాకతీయుల కంచుగంట - కాకతీయుల యొక్క కంచుగంట 
ఎడారి దిబ్బలు - ఎడారిలో దిబ్బలు 
ఇసుక గుండెలు - ఇసుక యొక్క గుండెలు 
యయాతిచరిత్ర - యయాతి యొక్క చరిత్ర
పుష్పగుచ్ఛము - పుష్పముల యొక్క గుచ్ఛము
వేదాంగాలు - వేదాల యొక్క అంగాలు 
సముద్రతీరము - సముద్రము యొక్క తీరము
సప్తమీ తత్పురుష సమాసము
బ్రాహ్మణభక్తి - బ్రాహ్మణుల యందు భక్తి
కుటీరపరిశ్రమ - కుటీరము లోని పరిశ్రమ
కంటినీరు - కంటి యందలి నీరు
నఞ్ తత్పురుష సమాసము: నఞ్ అంటే వ్యతిరేకార్థం.
అబావార్ధమును తెలియజేయును. ఇందలి రెండు పదములలో పూర్వపదము అభావమును తెల్పును. ఇచ్చట వ్యతిరేకార్ధము నిచ్చు 'న' వర్ణము వచ్చును. ఈ 'న' వర్ణమునకు హల్లు పరమగునపుడు న-'అ' గా మారును. అచ్చు పరమగునపుడు 'అన్' గా మారును.
వ్యతిరేకార్థాన్ని బోధించు న ప్రత్యయం మొదలుగాగల సమాసాలకు నఞ్ తత్పురుష సమాసాలని పేరు.
అనుచితము - ఉచితము కానిది
అనంతం - అంతం లేనిది 
అసాధ్యము - సాధ్యము కానిది 
కర్మధారయ సమాసాలు
కర్మధారయము: శేషణమునకు విశేష్యము తోడి సమాసము. విశేషణ విశేష్యాలతో ఎపడిన పదాలను కర్మధారయాలు అంటారు. 
కర్మధారయ సమాసాలను సమానాధికరణ సమాసాలు అనికూడా అంటారు. 
సమానాధికరణం: విశేషణానికి విషేశ్యం తోడి సమాసమైతే సమాసమైతే దానిని సమానాధికరణం అంటారు. విషేశ్యం: విషేశ్యం అనగా నామవాచకం.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము:
“సమాసము లోని పూర్వపదము విశేషణముగాను, ఉత్తరపదము విశేష్యముగాను ఉంటే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు”.
మధుర వచనము - మధురమైన వచనము
చిరునవ్వు - చిన్నదైన నవ్వు
నల్లకలువ - నల్లనయిన కలువ
పుట్టినిల్లు - పుట్టినట్టి ఇల్లు
పెనుతుఫాను - పెద్దదైన తుఫాను
కల్యాణ ఘంటలు - కళ్యాణ ప్రదమైన ఘంటలు 
మహారవము - గొప్పదైన రవము 
వికారదంష్ట్రలు - వికారమైన దంష్ట్రలు 
బృహత్కార్యం - బృహత్తు అయిన కార్యం 
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము:
“సమాసము లోని పూర్వపదము విశేష్యముగాను, ఉత్తరపదము విశేషణము ఉంటే దానిని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు”.
వృక్షరాజము - శ్రేష్ఠమైన వృక్షము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము:
సంభావనము: సంబోధనము, గుర్తు అను అర్ధములు ఉన్నాయి.
“సమాసము లోని పూర్వపదము సంజ్ఞావాచకముగాను, ఉత్తరపదము జాతి వాచకముగాను ఉన్నచో దానిని సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము అంటారు”. సంజ్ఞనే సంభావన అంటారు. సమాసములోని పుర్వపదంలో సంభావన ఉన్నట్లయితే ఆ సమాసాన్ని  సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము అంటారు.
ద్వారకా నగరము - ద్వారక అను పేరుగల నగరము.
తెలుగుభాష - తెలుగు అను పేరుగల భాష
గంగానది - గంగ అను పేరుగల నది. 
తెలంగాణ రాష్ట్రం - తెలంగాణ అనే పేరుగల రాష్ట్రం 
గోలకొండ పట్టణము - గోలకొండ అనే పేరుగల పట్టణం
ఛందస్సు - గణవిభజన
పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేది ఛందస్సు. పాదాది నియమాలు కలిగిన పద్య లక్షణాలను తెలుపునది చందస్సు. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందింది. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట  సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు
ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. 
ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు, లఘువు. 
గురువుని U తోటీ, లఘువుని I తోటీ సూచిస్తారు.
ఏకమాత్ర(రెప్పపాటు) కాలంలో పలుకబడేది లఘువు. 
ద్విమాత్రాకాలంలో పలుకబడేది గురువు. 
రెండుకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలను ప్లుతం అంటారు.
ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.

కొన్ని నియమాలు
దీర్ఘాలన్నీ గురువులు. (ఉదా: పాట = U I)
"ఐ", "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ"గురువు, "సైనిక్"లో "సై"గురువు)
ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే. (ఉదా: “అంగడి”లో సం గురువు, “దుఃఖము”లో దుః అనునది గురువు)
సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు. (ఉదా: “అమ్మ”లో అ గురువు, “సంధ్య”లో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. 
ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క"గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న"గురువు అవుతుంది
ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూచెన్ గలువలు"లో "చెన్"గురువు.)

లఘువులు
హ్రస్వాలు
హ్రస్వద్విత్వాలు
హ్రస్వసంయుక్తాలు
గురువులు
దీర్ఘాలు
ఐ, ఔ లతో కూడిన హల్లులు
సున్నతో కూడిన అక్షరాలు
విసర్గతో కూడిన అక్షరాలు
పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు
ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు
సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు
గణ విభజన
అక్షరాల గుంపును గణము అని అంటారు.
గణము అంటే మాత్రల సముదాయము. గురు లఘువుల సమూహం. 
గణాలలో ఏక అక్షర (ఒకే అక్షరం) గణాలు, రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు ఉంటాయి. 

ఏకాక్షర గణాలు
ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు ఏదైనా కావచ్చు.
ఉదా: శ్రీ, సై, లం
       U, U, U

రెండక్షరాల గణాలు
రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు 
లలము                   - II    ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగము (వ గణం)     - IU   ఉదా: రమా
గలము (హ గణం)    - UI   ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగము                   - UU  ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు
ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి. కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. 
య   మా   తా   రా   జ   భా   న   స   ల   గం
 I     U    U   U    I    U   I    I    I    U
య మా తా రా జ భా న స ల గం - యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది.

1

ఆది గురువు

 భ గణము

UII

5

ఆది లఘువు

య గణము

IUU

2

మధ్య గురువు

జ గణము

IUI

6

మధ్య లఘువు

ర గణము

UIU

3

అంత్య గురువు

స గణము

IIU

7

అంత్య లఘువు

త గణము

UUI

4

అన్నీ లఘువులు

న గణము

III

8

అన్నీ గురువులు

మ గణము

UUU


ఉపగణాలు

రెండక్షరాలవి - 4: గగ, గల, లగ, లల; 
నాలుగక్షరాలవి - 10: తగము, తలము, నగము, నలము, భగురు, భలము, రగము, రలము, మలఘు, సలము; 
ఐదక్షరాలవి - 7: నగలము, నగగము, నలలము, నలగము, సలలము, సలగము, సగలము.
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు.
సూర్య గణములు ఇంద్ర, గణములు, చంద్ర గణములు
సూర్య గణములు
న = న = III
హ = గల = U
ఇంద్ర గణములు
భ = UII
ర = UIU
త = UUI
న గము = IIIU
స లము = IIUI
న లము = III
చంద్ర గణములు
భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

వృత్తాలు
వృత్తము: నియత గణములును యతిప్రాసములుగల పద్యము.
ఆవి: చంపకమాల, ఉత్పలమాల, శార్థూలం, మత్తేభం

జాతులు
జాతులు మాత్రాగణములతో, ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమాలు ఉన్నాయి.
ఆవి: కందం, ద్విపద

ఉప జాతులు
తేటగీతి, ఆటవెలది
పాదం: పద్యమునందలి యొక చరణము. పద్యములో నాలుగవభాగము.
యతి: పద్యవిశ్రమస్థానము. ఛందస్సులో విరామ స్థానము. త్రి
ప్రాస: పద్యపాదమున రెండవ యక్షరము. పాదమందలి మొదటి అక్షరమునకు, య తిమై స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుట.
ప్రాస యతి: ప్రాసస్థాన అక్షరానికి యతిని పాటించడం.  పద్య పాదంలో రెండవ అక్షరానికి సాధారణ యతిమైత్రి స్థానంలోని తరువాటి అక్షరానికి యతిని పాటించడం ప్రాసయతి అంటారు.
వృత్త పద్య లక్షణాలు:

పద్యము

పాదాలు

గణములు

యస్థానం

అక్షరాలు

ప్రాసనియమం

ప్రాసయతి


పద్య లక్షణాలు

ఉత్పలమాల

4

భ ర న భ భ ర వ

20

10

ఉంటుంది

లేదు

శా

భ 

న 

మ 

స 

20

21

19

20

10

11

13

14

చంపకమాల

4

న జ భ జ జ జ ర

21

11

ఉంటుంది

లేదు

శార్థూలము

4

మ స జ స త త గ

19

13

ఉంటుంది

లేదు

మత్తేభము

4

స భ ర న మ య వ

20

14

ఉంటుంది

లేదు



పై నాలుగు పద్యాలలో అన్నింటిలోనూ నాలుగు పాదాలుంటాయి. అలాగే ప్రాస నియమం ఉంటుంది.  ప్రాస యతి వుండదు.

కందం: తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. 
సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే. పాదాలు నాలుగు కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు.
గగ గణము = UU { గురువు, గురువు }
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు}

ద్విపద: రెండు పాదములు గల పద్యము
లక్షణములు
ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. 
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి. అందుకే దీనిని ద్విపద అంటారు.
ప్రతిపాదములోనీ మూడు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
మూడవ గణం యొక్క మొదటి అక్షరం. 
ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, ప్రాస లేని ద్విపదను మంజరీ ద్విపద అని అంటారు.

తేటగీతి: తేటగీతి తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. తేటగీతి ఉపజాతికి చెందినది. తేటగీతి పద్యం సూర్య, ఇంద్రగణాలతో ఏర్పడుతుంది. 
పద్య లక్షణాలు:
తేటగీతిలో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో వరుసగా ఒక సూర్యగణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్యగణాలు ఉంటాయి.
ఒకటోవ గణం మొదటి అక్షరానికి నాలుగో గణంలో మొదటి అక్షరం యతి మైత్రి.
ప్రాసయతి ఉన్న పద్యాన్ని అంతరాక్కరగా పిలుస్తారు.కాని అన్ని అంతరాక్కరలు తేటగీతులు కావు.
ప్రాస నియమం లేదు.

ఆటవెలది: ఆటవెలది తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. ఆటవెలది ఉపజాతికి చెందినది.
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే. 
ప్రతి పాదానికి ఐదు గణాలు ఉన్నాయి.
1, 3 పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉన్నాయి.
2, 4 పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉన్నాయి.
ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లింది.
ప్రాస నిమయం లేదు.
ప్రాసయతి చెల్లును.

సీసపద్యం
పద్య లక్షణం :
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది.
రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోను, 5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోను మైత్రి కుదరాలి.
ప్రాస నియమం లేదు. ప్రాసయతి ఉండ వచ్చు. అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు రెండో జత అక్షరాలు ప్రాసలో ఉండవచ్చు. ఒకే అక్షరం అయి ఉండాలి (ఏ గుణింతమైనా సరే) 
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.
ఇందులో నాలుగు పాదాలుంటాయి.

అలంకారాలు: ఇల్లు, మనిషి, పెళ్ళి మంటపం, ఫంక్షన్‌హాలు, వాహనం ఏదైనాసరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. 
అట్లానే రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు. 

ఉపమాలంకారం: ఉపమాన, ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పడమే ఉపమాలంకారం.
ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది.
ఉపమేయం - దేనిని లేక ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది. (ఆమె ముఖం - ఉపమేయం) 
ఉపమానం - దేనితో లేక ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది. (చంద్రబింబం - ఉపమానం). 
సమానధర్మం - ఉపమేయ, ఉపమానాల్లో ఉండే ఒకే విధమైన ధర్మం. (అందంగా ఉండడం -సమానధర్మం ), 
ఉపమావాచకం - పోలికను తెలిపే పదం. (వలె - ఉపమావాచకం)

ఉత్ప్రేక్ష అలంకారం: పోలికను ఊహించి చెబితే అది 'ఉత్ప్రేక్ష' అలంకారం.
“ఈ మేఘాలు గున్న ఏనుగులా! అన్నట్టు ఉన్నాయి.”
ఉపమేయం : మేఘాలు     ఉపమానం : గున్న ఏనుగులు
అంటే మేఘాలను ఏనుగు పిల్లలవలె ఊహిస్తున్నామన్నమాట.

అతిశయోక్తి అలంకారం: ఏదైనా ఒక వస్తువును గాని, విషయాన్ని గాని ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చెప్పడం 'అతిశయోక్తి' అలంకారం.
హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాని అవి నిజంగా ఆకాశాన్ని తాకవు. 
కాని వాటిని ఎక్కువచేసి చెప్పడంవల్ల 'ఆకాశాన్ని తాకుతున్నాయి' అని అంటున్నాము.
కం. చుక్కలు తల పూవులుగా
      నక్కజముగ మేను పెంచి యంబరవీథిన్     
     వెక్కసమై చూపట్టిన 
      నక్కోమలి ముదము నొందె నాత్మస్థితిలోన్.

మా ఊర్లో సముద్రమంత చెరువు ఉన్నది.
అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు..

స్వభావోక్తి అలంకారం: విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే 'స్వభావోక్తి అలంకారం'. 
శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ 
"గౌరవించదగిన, పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా?" అని సోన్దేవుని మందలించాడు.
పై వాక్యంలో కన్నులు ఎర్రబడటం, పై పెదవి అదరడం, గట్టిగా హుంకరించడం, కనుబొమ్మ ముడి కదలాడటం 
కోపంగా ఉన్నప్పుడు కలిగే స్వభావాలు. ఇట్లా ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం కూడా ఒక అలంకారమే. 
దీన్ని 'స్వభావోక్తి’ అలంకారం అంటారు.

యమకాలంకారం: పదాలు తిరిగి తిరిగివస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. పదాల విరుపువల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత.
లేమా! దనుజుల గెలువగ
లేమా! నీవేల కడగి లేచితివిటురా
పాఱజూచిన పరసేన పాఱఁజూచు.

ఛేకానుప్రాసాలంకారము: హల్లుల జంట అర్థభేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని 'ఛేకానుప్రాసాలంకారం' అంటారు.
“నీటిలో పడిన తేలు తేలుతదా!”
అరటితొక్క తొక్కరాదు.
నిప్పులో పడితే కాలు కాలుతుంది.
తమ్మునికి చెప్పు! చెప్పు తెగిపోకుండా నడువుమని.
నీకు వంద వందనాలు

అంత్యానుప్రాస అలంకారం: పాదం చివర లేదా పంక్తి చివరలో ఒకే ఉచ్చారణతో ముగిసే పదాలు లేదా అక్షరాలు ఉంటే  దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. 
పదాల, పాదాల, వాక్యాల చరణాల పై పాదాల చివర అక్షరాలు పునరుక్తమవడాన్ని 'అంత్యాను ప్రాస' అంటారు.
నగారా మోగిందా
నయాగరా దుమికిందా
తెలుగు జాతికి అభ్యుదయం 
నవ భారతికే నవోదయం
గొడ్ల డొక్కలు గుంజినా ......
వాన పాములు ఎండినా ......
గుడిసెకు విసిరి పోతివా ...... 
నడుం చుట్టుక పోతివా ......
ఎన్నడొస్తవు లేబరీ; పాలమూరి జాలరీ !
కొందరికి రెండు కాళ్ళు 
రిక్షావాళ్ళకి మూడు కాళ్ళు 
ఉన్నవాళ్ళకి నాలుక్కాళ్ళు
రంగదరాతిభంగ; ఖగరాజతురంగ; విపత్పరంపరో 
త్తుంగ తమఃపతంగ; పరితోషితరంగ; దయాంతరంగ; స 
త్సంగ; ధరాత్మజా హృదయ సారస భృంగ; నిశాచరాబ్జ మా 
తంగ; శుభాంగ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

వృత్యానుప్రాస అలంకారం: ఒక హల్లు గాని, రెండు మూడు హల్లులు గాని, వేరుగా ఐనా, కలిసి ఐనా, మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు.  ఒకే హల్లు అనేకసార్లు రావడాన్ని ‘వృత్త్యను ప్రాస’ అలంకారం అంటారు.

అడిగెద నని కడువడిఁ జను
నడిగినదను  మగుడ నుడుగఁడని నడ యుడుగున్ 
వెడవెడ డిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
రాజు రివాజులు బూజు పట్టగన్
గడ గడ వడకుచు తడబడి జారిపడెను. 
రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది.
రూపకాలంకారము: ఉపమేయానికి, ఉపమానానికి భేదం (తేడా) ఉన్నా, లేనట్లు చెపితే అది రూపకాలంకారం.
ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు.
బతుకాటలో గెలుపు ఓటములు సహజం.
వానజాణ చినుకుపూలను చల్లింది.
నవ్వులనావలో తుళ్ళుతూ పయనిస్తున్నాం.
అజ్ఞానాంధకారం తొలిగితే మంచిది.
నగరారణ్య హోరు నరుడి జీవనఘోష.

శ్లేషాలంకారం: నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష.
ఒకే శబ్దం రెండు వేర్వేరు అర్థాలనందిస్తున్నది. (విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి.) 
విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దానిని 'శ్లేషాలంకారం' అని అంటారు.
మిమ్ముమాధవుడు రక్షించుగాక!
మానవ జీవనం సుకుమారం.
రాజు కువలయానందకరుడు.
నీవేల వచ్చెదవు.
మావిడాకులు తెచ్చివ్వండి.
వాడి కత్తి తీసుకోండి.
ఆమె లత పక్కన నిలుచున్నది.

సంశ్లిష్ట వాక్యం: రెండు లేక మూడు వాక్యాలు కలిపి రాసేటప్పుడు చివరి వాక్యంలోని సమాపక క్రియ అలాగే ఉంటుంది. ముందు వాక్యాల్లోని సమాపక క్రియలు, అసమాపక క్రియలుగా మారుతాయి. కర్త పునరుక్తం కాదు. దీనినే "సంశ్లిష్ట వాక్యం" అంటారు.
వ్యాసుడు కాశీనగరానికి వచ్చి, తపస్సు చేశాడు,
జ: వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు. 
మాధవ్ మైదానానికి పోయి, ఖోఖో ఆట ఆడాడు.
జ: మాధవ్ మైదానానికి పోయాడు. మాధవ్ ఖోఖో ఆట ఆడాడు.
గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది.
జ: గీత బజారుకు వెళ్ళి, కూరగాయలు కొన్నది. 
విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది.
జ: విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.
అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది.
జ: అమ్మ నిద్ర లేచి, ముఖం కడుక్కుంది.
రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు.
జ: రవి ఊరికి వెళ్ళి, మామిడి పండ్లు తెచ్చాడు.
అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చువేయించాడు.
జ: అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి, అచ్చువేయించాడు.
గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణశర్మ అనేక సన్మానాలు పొందాడు.
జ: గడియారం రామకృష్ణశర్మ మంచి పాండిత్యం సంపాదించి, అనేక సన్మానాలు పొందాడు.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు.
జ: కప్పగంతుల లక్ష్మణశాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి, ప్రచురించాడు.

సంయుక్త వాక్యం: రెండు వాక్యాలను కలిపి రాసేటప్పుడు క్రియలలో మార్పు లేకుండా మధ్యలో అనుసంధాన పదాలు రాస్తే అవి "సంయుక్త వాక్యాలు" అవుతాయి. 
అనుసంధాన పదాలు అంటే కావున, కానీ, మరియు, అందువల్ల మొదలైనవి. రెండు నామ పదాల్లో ఒకటి లోపించడం. రెండు నామపదాలు ఒకేచోట చేరి చివర బహువచనం చేరడం. 
రైలు వచ్చింది. చుట్టాలు రాలేదు.
జ: రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. 
వర్షాలు కురిసాయి. పంటలు బాగా పండాయి.
జ: వర్షాలు కురిసాయి కావున పంటలు బాగా పండాయి.
అతనికి కనిపించదు. అతడు చదువలేడు.
జ: అతనికి కనిపించదు కావున అతడు చదువలేడు.
వనజ చురుకైనది. వనజ అందమైనది.
జ: వనజ చురుకైనది, అందమైనది. 
దివ్య అక్క శైలజ చెల్లెలు.
జ: దివ్య, శైలజ అక్కాచెల్లెళ్ళు 
రామయ్య వ్యవసాయదారుడా?
జ: రామయ్య ఉద్యోగస్తుడా? రామయ్య వ్యవసాయదారుడా? ఉద్యోగస్తుడా? 
ఆయన డాక్టరా? ఆయన ప్రొఫెసరా?
జ: ఆయన డాక్టరా, ప్రొఫెసరా? 
నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులూ ఉన్నారు. 
నల్గొండ జిల్లాలో పత్రికా విలేఖరులు ఉన్నారు.
జ: నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులూ, పత్రికా విలేఖరులు ఉన్నారు.
నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. 
జ: నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు.
తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.
జ: తెలుగువాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కాని వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు.

సామాన్య వాక్యాలుగా మార్చడం:
తిరుమల రామచంద్రగారు సంస్కృత, ఆంధ్రభాషలలో పండితుడు.
జ: తిరుమల రామచంద్రగారు సంస్కృతభాషలో పండితుడు.
    తిరుమల రామచంద్రగారు ఆంధ్రభాషలో పండితుడు.
నేనొకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
జ: నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
    నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని.
ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు.
జ: ఇంట్లో మాట్లాడే భాష వేరు.
    ఇంట్లో బడిలో చదివే భాష వేరు.

కర్తరి, కర్మణి వాక్యాలు
ఒక వాక్యంలో క్రియ, కర్తను సూచిస్తే అది కర్తరి వాక్యం, కర్మను సూచిస్తే కర్మణి వాక్యం. 
ఆళ్వారుస్వామి 'చిన్నప్పుడే' అనే కథ రాశాడు. (కర్తరి) 
జ: 'చిన్నప్పుడే' అనే కథ ఆళ్వారుస్వామిచే రచింపబడింది. (కర్మణి)
పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని 'తమస్' నవలలో చిత్రించాడు. 
జ: పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మసహాని చేత 'తమస్' నవలలో చిత్రించబడ్డాయి.
హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు.
హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది.
నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు.
నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు.

ప్రత్యక్ష కథనం
ఒకరు చెప్పిన మాటలు / వాక్యాలను చెప్పింది చెప్పినట్లే రాయాలి. ఆ మాటలకు / వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు (“ “) ఉండాలి.
ప్రథమపురుషలో ఉన్న పదాలు (అనగా తమను, తమ, తాను, తాము వంటి పదాలు) ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి.
"అక్కా! ఆ చెరువు జూడు.”
"నేను రాన్రా తమ్ముడు. ".
"పిల్లలూ! రేపు బీర్పూరు జాతరకు వెళుతున్నాను.”
"మేమూ వస్తాం సర్.”
"మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువ కాదు" అన్నాడు భాగ్యరెడ్డి వర్మ.
జ: మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువ కాదని అన్నాడు భాగ్యరెడ్డి వర్మ.
రుద్రమదేవితో తల్లి నారాంబ “నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావి చక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి కాని కన్నీళ్ళు ఉండకూడదు" అన్నది.
జ: ఆమె తానూ, మామూలు స్త్రీలం కాదని, ఆమె పట్టమహిషివయని, తాను భావి చక్రవర్తినని, వాళ్ళకు కండ్లు మటుకే ఉండాలి కాని కన్నీళ్ళు ఉండకూడదని తల్లి నారాంబ రుద్రమదేవితో అన్నది.
రాజకీయపార్టీల వారు “జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర" అని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించారు.
జ: రాజకీయపార్టీల వారు తమ ఎన్నికల ప్రణాళికల్లో జనానికి తక్షణం కావల్సింది కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర అని ప్రకటించారు.
“సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది" అని నెహ్రూ అన్నాడు.
జ: సుదీర్ఘకాలం అణచివేయబడిన జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుందని నెహ్రూ అన్నాడు.
"హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది" అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు.
జ: హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటించాడు.
"తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి” అని గూడూరి సీతారాం అన్నాడు.
జ: తెలుగు కథాసాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నాడు.
“చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది" అని డి. రామలింగం పేర్కొన్నాడు.
జ; చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి. రామలింగం పేర్కొన్నాడు.

పరోక్ష కథనం
ఇవి సూటిగా వాళ్లే చెప్తున్నట్లు కాకుండా! ఇంకొకళ్ళు చెప్తున్నట్లున్నాయి కదా!
ఇలాంటి వాక్యాలను "పరోక్ష కథనం"లో ఉన్న వాక్యాలు అంటారు.
వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు.
పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి “అని” చేరుస్తారు.
ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలుగా తాను, తాము, తన తమ లుగా మారుతాయి.

హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు.
జ: “నేను రాను” అని హర్షవర్ధన్ హర్షిణితో అన్నాడు.
ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు.
జ: “మీరు చెప్పినట్లు చేస్తాము” అని ప్రధానోపాధ్యాయునితో పిల్లలు అన్నారు.
తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు.
జ: “నన్ను క్షమించు” అని రాజు తన మిత్రునితో అన్నాడు.
పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరమని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
జ: “పరిపాలనారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం అవసరం” అని ముఖ్యమంత్రి ప్రకటించాడు.
సమాజాన్ని సంక్షేమపథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరని మేధావులు నిర్ణయించారు.
జ:“సమాజాన్ని సంక్షేమపథకాలరూపంలో ఆదుకోవడం తప్పనిసరి” అని మేధావులు నిర్ణయించారు.
తెలుగులోనే రాయండని, తెలుగే మాట్లాడండని టి.వి. ఛానల్లో ప్రసారం చేశారు.  
జ: “తెలుగులోనే రాయండి. తెలుగే మాట్లాడండి.” అని టి.వి. ఛానల్లో ప్రసారం చేశారు.

వ్యవహారభాషలోనికి మార్చడం

పట్టణము అలంకారముగా నుండుటకు అందరును ఉత్సాహముతో పాటుపడిరి. 
జ: పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు.
ఈ మందిరము నందే పారశీకపు రాయబారికిని, అతని అనుచరవర్గమునకును బస ఏర్పాటు చేసిరి.
జ: ఈ మందిరంలోనే పారశీకపు రాయబారికీ, అతడి అనుచరవర్గానికీ బస ఏర్పాటు చేసారు.
నీటి కాలువలు, జలాశయములు, జలపాతములు అచ్చెరువు గొల్పుచుండెను.
జ: నీటి కాలువలూ, జలాశయాలూ, జలపాతాలూ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నియు లోపలి కోటలో నుండుచుండెను.
జ: పెద్ద అధికారుల మందిరాలన్నీ లోపలి కోటలో ఉంటాయి.
వజ్రములకు గోలకొండ పుట్టినిల్లే గదా!
జ: వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా!
పట్టణములోనికి సరుకంతయు బంజారాదర్వాజా ద్వారానే వచ్చుచుండును.
జ: పట్టణంలోకి సరుకంతా బంజారా దర్వాజా నుండే వస్తూంటుంది.


తెలుగు ఉపాధ్యాయులు 
వృత్తి సంబంధమైన అప్డేట్స్ కోసం
కింది వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి

Click on WhatsApp Icon and Join


తెలుగు బడి 1    

తెలుగు బడి 2  

తెలుగు బడి 3 

తెలుగు బడి 4 



రచయితలు
మీ రచనా ప్రక్త్రియ ఏదైనా 
ప్రవాహిని అంతర్జాల సాహిత్య పత్రికలో ప్రచురణ కోసం
కింది వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి మరియు 

కింది నంబర్లలో వాట్సాప్ నందు సంప్రదించగలరు
90101 37504, 63023 24734

Click on WhatsApp Icon and Join 

ప్రవాహిని 1

ప్రవాహిని 2






Prepared by.... Rajendra 

WhatsApp No. 9010137504, 6302324734.



Download Pdf  Click here

0/Post a Comment/Comments