సాహితీ స్నేహయాత్రలో పాల్గొన్న డాక్టర్ అడిగొప్పుల

సాహితీ స్నేహయాత్రలో పాల్గొన్న డాక్టర్ అడిగొప్పుల

తేది: 06-08-2023 న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 172 మంది కవులు "బమ్మెర -పాలకుర్తి సాహితీ స్నేహయాత్ర" చేశారు.సాహితీ గౌతమి మరియు పెద్దపల్లి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీ గాజుల వెంకట శ్యాంప్రసాద్ లాల్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహితీ యాత్రలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వావిలాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న డాక్టర్ అడిగొప్పుల సదయ్య పాల్గొన్నారు.ఈ యాత్ర ఉదయం 7-00 గంటలకు మొదలయ్యి రాత్రి 10-00 గంటల వరకు కొనసాగింది.ఈయాత్రలో మొదట తెలుగుభాషకు ప్రాచీన హోదా కలగడానికి కారణమైన జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం,గూడూరులోని త్రిభువన మల్లుడు వేయించిన గూడూరు శిలా శాసనాన్ని దర్శించారు.ఆ తరువాత శ్రీమద్భాగవతం విరచించిన నెల్లుట్ల పోతన గారి జన్మస్థానమైన బమ్మెరకు చేరుకొని అక్కడి స్మారక మందిరంతో పాటు చారిత్రక ఆధారాలైన వారు నివసించిన స్థలం,వారు ఆరాధించిన రాముని గుడి,వారి వ్యవసాయ క్షేత్రం,సమాధి సందర్శించడం జరిగింది.పిదప పాలకుర్తిలోని ఎంఎల్ ఎ దయాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గతంలో కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారిగా పనిచేసిన శ్రీ జి వి శ్యాంప్రసాద్ లాల్ గారిపై 93 మంది కవులు రాసిన "భోజరాయలు కవితా సంకలనం"ను వారి చేతుల మీదుగానే ఆవిష్కరణ చేయించడం జరిగింది.తరువాత పాలకుర్తికి వెళ్ళి బసవపురాణం రాసిన తెలంగాణా ఆదికవి అయిన పాల్కురికి సోమనాథుని స్మారక మందిరంతో పాటు గుట్టపై స్వయంభూగా వెలసిన సోమేశ్వరాలయం మరియు సోమన సమాధిని కవులంతా  సందర్శించడం జరిగింది.ఈ యాత్రలో ఇరువురు కవులకు సంబంధించిన చారిత్రక ఆధారాలను సందర్శించి,వారు నడయాడిన నేలపై నడిచి ఆనందోద్వేగానికి గురయ్యారు.ఈ కార్యక్రమంలో శ్యాంప్రసాద్ గారితో పాటు సాహితీ గౌతమి అధ్యక్షుడు శ్రీ నంది శ్రీనివాస్, మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం అధ్యక్షుడు శ్రీ డా.అడిగొప్పుల సదయ్య,సీనియర్ కవులు నవనీతరావు,అన్నాడి గజేందర్ రెడ్డి,అన్నవరం దేవేందర్ , డా.వైరాగ్యం ప్రభాకర్,కూకట్ల తిరుపతి, విజయలక్ష్మి దొంతరాజు,మొదలైన కవులు  పాల్గొన్నారు.


0/Post a Comment/Comments